సిరిసిల్ల, సెప్టెంబర్ 5: బుల్లితెర క్విజ్ కార్యక్రమం కౌన్ బనేగా కరోడ్పతి (కేబీసీ)లో మంత్రి కేటీఆర్ గతంలో ట్వీట్ చేసిన ఓ అంశాన్ని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రశ్నగా అడిగారు. గత శుక్రవారం రాత్రి 9 గంటలకు ప్రసారమైన ఈ కార్యక్రమంలో క్రికెట్ దిగ్గజాలు సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ హాట్సీట్లలో కూర్చొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ గతంలో చేసిన ఓ ట్వీట్పై ఏడో ప్రశ్నను బీగ్బీ వేశారు. కరోనా సంక్షోభ సమయంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ‘కొన్ని కొవిడ్-19 మెడిసిన్ పదాలు రాసి వీటిని సరిగ్గా పలికేవారు ఉన్నారా?’ అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. శశిథరూర్ అయితే సరిగ్గా సమాధానం చెప్పగలరని ట్యాగ్ కూడా చేశారు. ఇదే అంశాన్ని కేబీసీలో ప్రశ్నగా అమితాబ్ అడిగారు. ‘పలుకజాలని పేరున్న మెడిసిన్లను ఎవరైతే సరిగ్గా జవాబివ్వగలరని తెలంగాణ ఐటీ మంత్రి ట్వీట్ చేశారు?’ అంటూ నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. ఎ) కపిల్ సిబల్ , బి) సుబ్రహ్మణ్యస్వామి, సి) అవితావ్ గోష్, డి) శశిథరూర్ అని ఇచ్చారు. ఈ ప్రశ్నకు సౌరవ్గంగూలీ శశిథరూర్ అని సమాధానం చెప్పారు. శశిథరూర్కు ఇంగ్లిష్ భాషపై పట్టు ఉంటుందని ఆయన పేరు అంచనా వేసి చెప్పానని సౌరవ్ గంగూలీ చెప్పడంతో కార్యక్రమంలో నవ్వులు పూశాయి. మంత్రి కేటీఆర్ ట్వీట్ ప్రశ్నగా మారడం ప్రాధాన్యం సంతరించుకున్నది.