KTR | మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి.. పోక్సో కేసులో ఇరుక్కున్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ను పోలీసులు ఇంకా అరెస్టు చేయకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బేటీ బచావో – బేటీ పడావో అనేది ఒరిజినల్ స్లోగన్ అయినప్పటికీ ఇప్పుడు కొత్త నినాదం తెరమీదకు వచ్చిందని తెలిపారు. బేటా భగావో – బేటా బచావో అనే నినాదాన్ని బీజేపీ, కాంగ్రెస్ పాటిస్తున్నాయని మండిపడ్డారు. వెల్డన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ అని వ్యాఖ్యానించారు.
అంతకుముందు ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితునిగా ఉన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను పోలీసులు అరెస్టు చేయకపోవడంపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఆఫీసర్ రితిరాజ్ గైక్వాడ్ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు ఆయన కాల్ డాటాను సేకరిస్తున్నారని, దొరుకగానే పట్టుకుంటామని అన్నారు. దీంతో భగీరథ్ పరారీలో ఉన్నట్టు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చక్కర్లు కొట్టాయి. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘కేంద్ర హోంమంత్రి కుమారుడు పరారీలో ఉన్నాడా? దేశ చరిత్రలో ఇదే మొదటిసారా?’ అని ప్రశ్నించారు.