హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): మునుగోడు నియోజకవర్గ గులాబీ దండులో విజయదరహాసం వెల్లివిరిసింది. నియోజకవర్గం అంతా ద్విచక్రవాహనాల ర్యాలీలతో హోరెత్తింది. బోనాలు.. బతుకమ్మలతో శిగాలూగింది. మునుగోడు నియోజకర్గ టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి నామినేషన్ సందర్భంగా గురువారం ఆవిష్కృతమైన దృశ్యం ఇది. ఎర్రటి ఎండను లెక్కచేయక ప్రజలు బ్రహ్మరథం పట్టారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు తన ప్రసంగంతో మునుగోడు ప్రజలను ఆలోచింపజేశారు. మునుగోడులో ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో తనదైన శైలిలో వివరించారు. దీంతో తమ గెలుపు ఖాయమైందని, మెజారిటీయే తేలాల్సి ఉన్నదని గులాబీ శ్రేణు లు సంబురంతో ఊగిపోయారు. ఈ ఉపఎన్నికలో ప్రజావ్యతిరేక బీజేపీకి మూడో స్థానమేనని స్థానికులు అంటున్నారు.
మునుగోడు నియోజకవర్గవ్యాప్తంగా గురువారం గులాబీ శ్రేణులు జైత్రయాత్ర చేశాయి. నియోజకవర్గంలోని 298 పోలింగ్ బూత్ల నుంచి ప్రజలు నియోజకవర్గ కేంద్రమైన చండూరుకు దండుకట్టారు. ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా చండూరులో చిందేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి నామినేషన్ సందర్భంగా ప్రతీ గ్రామం నుంచి యువకులు స్వచ్ఛందంగా తరలి వచ్చారు. ఎవరికి తోచిన రీతిలో వారు బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఊరూరా ఆడబిడ్డలు బోనాలు.. బతుకమ్మలతో చండూరుకు చేరుకొన్నారు. టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం కార్యకర్తలు కార్యోన్ముఖులై కదిలారు. మంత్రులు, ఆయా గ్రామాల ఇన్చార్జి ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు చండూరుకు కదం తొక్కారు.
చండూరు మండలం బంగారిగడ్డ. చండూరుకు నాలుగు కిలోమీటర్ల దూరం. గట్టిగా నడిస్తే 10 నిమిషాల్లో చేరుకోవచ్చు. కానీ గురువారం మంత్రి కే తారకరామావు రోడ్షోలో నడవటానికి గంటన్నర పట్టింది. దారిపొడవునా కళాకారుల నృత్యాలు.. డప్పుల మోత లు.. లయబద్ద చిందులు.. బోనాలు.. బతుకమ్మలు.. వేలాది మంది గులాబీ.. ఎరుపుదండు విన్యాసాలు.. దారిపొడవునా జనం జేజేలు.. నామినేషన్ దాఖలు చేయటానికి వచ్చే కోలాహలం. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ దాఖలుకు మంత్రి కే తారక రామారావు వస్తున్నారనే సమాచారంతో నియోజకవర్గంలోని యువకులు, రైతులు.. గొల్లకురుమలు.. నేతన్నలు.. గీతన్నలు.. గంగపుత్రులు.. ముదిరాజ్లు.. ఇలా సబ్బండ వర్ణాల సమ్మేళనంలా ర్యాలీ సాగింది. ద్విచ క్రవాహనాల ర్యాలీలతో గ్రామగ్రామాన పండుగ వాతావరణం నెలకొన్నది. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ గెలిచిపోయిందన్న విశ్వాసం మునుగోడు నియోజకవర్గం అంతా జైత్రయాత్రలా సాగింది.
మంత్రి కేటీఆర్ ప్రసంగానికి మునుగోడు ఫిదా అయింది. ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఆయన ప్రసంగం సాగింది. మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తున్నంత సేపు జనం ఓపికతో విన్నారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై కేటీఆర్ నిప్పుల చెరిగారు. తెలంగాణపై ప్రధాని మోదీ కుట్రలను ప్రజలముందు ఉంచారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం గత 8 ఏండ్లుగా నియోజకవర్గానికి చేసిన పనులను..తెచ్చిన పథకాలను ఏకరువు పెట్టారు. టీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలో విడమరచి చెప్పారు. తెలంగాణపై కుట్రలు చేస్తూ అడగడుగునా ప్రగతిని అడ్డుకొంటున్న ప్రధాని మోదీని ఉతికి ఆరేశారు. మోదీ బాత్ కరోడోమే..కామ్ పకోడీమో అన్నప్పుడు రోడ్షో ప్రాంగణం ఈలలతో మార్మోగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను..అమలు చేసిన పథకాలను అంకెలతో సహా వివరించి ప్రత్యర్థుల నోళ్లకు సంకెళ్లు వేశారు. రోడ్షో ఆసాంతం కేటీఆర్ ఆర్ద్రంగా.. ఆగ్రహంగా.. ఆలోచనాత్మకంగా ప్రసంగించారు.
మునుగోడు నియోజకర్గంలోని గులాబీ శ్రేణుల్లో కేటీఆర్ ఉత్సాహం నింపారు. కర్తవ్యబోధ చేశారు. ప్రజలు టీఆర్ఎస్వైపే.. కేసీఆర్వైపే ఉన్నారు.. ప్రత్యర్థులు చేసే ప్రలోభ పర్వాలకు మునుగోడు లొంగదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేసిన మంచిపనులను ప్రజలకు వివరించాలి అని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మునుగోడు ప్రజలు డబ్బుకు లొంగరు..కేవలం ప్రేమను మాత్రమే ఆశిస్తారు..దాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ప్రతీ ఒక్క గులాబీ సైనికుడిపై ఉన్నదని విడమరచి చెప్పారు. అలాగే సీపీఐ, సీపీఎం కార్యకర్తల్లోనూ సమన్వయ ఉత్సాహాన్ని నింపారు. మొత్తంగా గురువారం మునుగోడు నియోజకవర్గంలో గులాబీ శ్రేణులు నామినేషన్ దాఖలు నాడే జైత్రయాత్రను తలపించి కొత్త ఉత్సాహంతో ఊగిపోయారు.
మంత్రి కేటీఆర్ ఆలోచింపచేసిన ప్రసంగంతోపాటు ‘మునుగోడును దత్తత తీసుకుంటా.. అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాది. సూర్యాపేటను మంత్రి జగదీశ్రెడ్డి.. సిరిసిల్లను నేను ఎలాగైతే అభివృద్ధి చేశామో.. కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని మీరు గెలిపిస్తే మీకు అన్ని విధాలుగా అండగా ఉంటా. అభివృద్ధి రుచి చూపిస్తా’అని మంత్రి కేటీఆర్ హామీ ఇవ్వటంతో చండూరు మండల కేంద్రంలోనే కాదు మునుగోడు యావత్తు ఎగిరి గంతేసింది. చప్పట్లు.. ఈలలు..కేరింతలతో మారుమోగిపోయింది. మొత్తంగా ‘మునుగోడు గెలుపు..ప్రగతికి మలుపు’ అనే వాతావరణం నెలకొన్నది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై అభిమానం ఉన్న కొద్ది మంది కూడా కేటీఆర్ పర్యటనతో టీఆర్ఎస్వైపు మళ్లారు. దీంతో బీజేపీకి నియోజకవర్గంలో జెండాలు మోసేవారు కూడా కరువయ్యారని స్థానిక నేతలు అంటున్నారు. రాజగోపాల్రెడ్డికి ఈసారి డిపాజిట్ దక్కితే గొప్పేనని చెప్తున్నారు. బీజేపీ మూడోస్థానం కోసమో.. అంతకంటే కింది స్థానం కోసమో కొట్లాడటమే మిగిలిందని విశ్లేషిస్తున్నారు.