KTR | తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో స్కామ్కు తెరలేపినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల పరిధిలో ముచ్చర్ల ప్రాంతంలోని రెండు వేల ఎకరాల అభివృద్ధి పనులను దుబాయిలోని ఎమ్మార్ బిల్డర్స్కు అప్పగించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.
ఈ ఒప్పందం కోసం 11 ఏళ్లుగా కొనసాగుతున్న బౌల్డర్ హిల్స్ ప్రాజెక్టు కేసు నుంచి తప్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఎమ్మార్ బిల్డర్స్ కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. బౌల్డర్ హిల్స్ ప్రాజెక్టు స్కామ్ కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మార్ ఎంజీఎఫ్ మధ్య జరిగిన వివాదాస్పద ఒప్పందమే కావడం గమనార్హం.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మార్ బిల్డర్స్ మధ్య తాజాగా ఒప్పందం జరిగినట్లు వస్తున్న కథనాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ ఒప్పందాన్ని చూస్తుంటే కాంగ్రెస్ పాలనలో మరో కుంభకోణం జరుగుతుందని అనిపిస్తోందని అన్నారు. స్కాంగ్రెస్ చేస్తున్న పనులను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.