హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): లేఅవుట్ అనుమతులకు సంబంధించి టీఎస్బీపాస్ను దేశానికే ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దాలని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. సోమవారం మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖలో అమలవుతున్న పలు పథకాలు, ప్రాజెక్టులపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. టీయూఎఫ్ఐడీసీ ద్వారా పురపాలికల్లో అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై వివరాలు తెలుసుకొన్నారు. టీఎస్బీపాస్ విధానం క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరుపై సమీక్షించారు. పట్టణాల రూపురేఖల మార్పు, మౌలిక సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నదని, దీనిలో భాగంగానే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రతినెల పురపాలికలకు ప్రత్యేకంగా నిధులను అందజేస్తున్నామని పేర్కొన్నారు. దీనికి అదనంగా టీయూఎఫ్ఐడీసీని ఏర్పాటుచేసి పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నామని తెలిపారు. తద్వారా ఆయా పట్టణాల్లో పౌర, మౌలిక సదుపాయాలు వేగంగా కల్పించగలుగుతున్నట్టు చెప్పారు.
దేశానికి ఆదర్శంగా బీపాస్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన టీఎస్ బీపాస్ను పౌరులు విస్తృతంగా ఉపయోగిస్తున్నారని అధికారులు మంత్రి కేటీఆర్కు గణాంకాలతో ప్రజెంటేషన్ ఇచ్చారు. టీఎస్బీపాస్కి సంబంధించి అనుమతుల జారీ ప్రక్రియలో ఆలస్యం బాగా తగ్గిపోయిందని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు రూపొందించిన టీఎస్బీపాస్ చట్టంలో పేర్కొన్న అన్ని రకాల సౌకర్యాలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా పురపాలకశాఖ పనిచేయాలని సూచించారు. ఈ చట్టం వచ్చిన తర్వాత అనుమతుల ప్రక్రియ గతంకంటే సులభమైందని తెలిపారు. ఈ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయాలని, వెబ్సైట్లో అవసరమైన మార్పులను చేయాలని, ఫిర్యాదులకు వేగంగా స్పందించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను బలోపేతంచేయాలని, టోల్ఫ్రీ నంబర్కు మరింత ప్రచారం కల్పించాలని పేర్కొన్నారు. పరిశ్రమల అనుమతుల ప్రక్రియలో టీఎస్ ఐపాస్ మాదిరే భవన నిర్మాణం, లేఅవుట్ అనుమతులకు సంబంధించి టీఎస్బీపాస్ సైతం దేశానికి ఆదర్శంగా నిలిచే వ్యవస్థగా, అందరూ అనుసరించేలా మార్చాలన్నారు.
పట్టణాల్లో మాస్టర్ ప్లాన్లు..
పురపాలికల మాస్టర్ ప్లాన్ తయారీపైన మంత్రి కేటీఆర్ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకొన్నారు. మాస్టర్ ప్లాన్ల తయారీ ప్రక్రియ ఇప్పటికే పలు పురపాలికలు, అన్ని కార్పొరేషన్లలో పూర్తయిందని, కొత్త మున్సిపాలిటీలలో సాధ్యమైనంత తొందరగా పూర్తిచేసేందుకు ప్రణాళికలు సిద్ధంచేయాలని ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో పురపాలకశాఖ కొనసాగిస్తున్న తాగునీటి ప్రాజెక్టుల పురోగతి.. జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన ఎస్సార్డీపీ అభివృద్ధి కార్యక్రమాలపైనా మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ఈ వారంలోనే మరో రెండు కీలకమైన ఫ్ల్లైఓవర్లను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్కుమార్, సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, జలమండలి, టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.