తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అమెరికాలోని న్యూయార్క్ నగరంలో సామాన్యుడిలా విహరించారు. న్యూయార్క్ వీధుల్లో కాలినడకన తిరిగారు. స్ట్రీట్ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేశారు. తన విద్యార్థి, ఉద్యోగ జీవితకాలానికి సంబంధించిన జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల వరద పారించేందుకు మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లారు. కొన్ని రోజులుగా పెద్దపెద్ద కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేలా ఒప్పించారు. కాగా, శనివారం ప్రపంచంలోనే టాప్ ఫార్మా కంపెనీ అయిన ఫైజర్ సీఈవోతో సమావేశం ముగిసిన అనంతరం కేటీఆర్ న్యూయార్క్ వీధుల్లో కాలినడకన తిరిగారు.
విద్యార్థిగా ఉన్నప్పుడు లెక్సింగ్టన్, 34 అవెన్యూలో తాను తిన్న స్ట్రీట్ ఫుడ్ వద్దకు వెళ్లారు. తనకు అత్యంత ఇష్టమైన వేడి వేడి సాస్తో కూడిన చికెన్ రైస్ని కొని తిన్నారు. ఆ తర్వాత సమావేశానికి ఆలస్యం అవుతుండడంతో న్యూయార్క్లో ఉండే ఎల్లో క్యాబ్ ఎక్కి వెళ్లారు. ఉదయం నుంచి ఆయనతో ఉన్న తెలుగు ఎన్నారైలు కేటీఆర్ ఒక సాధారణ వ్యక్తిలా క్యూలో నిల్చుండి తన ఆహారం కొనుక్కోవడం, తర్వాత మీటింగ్కి క్యాబ్లో వెళ్లడం చూసి ఆశ్చర్యపోయారు. ఆయన సింప్లిసిటీ, కమిట్మెంట్ను అభినందించారు.