హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ప్రతి రోజు పనికిమాలిన విమర్శలు చేసే ప్రతిపక్ష నాయకులు రేవంత్, బండి సంజయ్, ప్రవీణ్కుమార్, షర్మిల తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కడున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. సాగరహారానికి శుక్రవారంతో పదేండ్లు పూర్తి అంటూ పాత జ్ఞాపకాలను ఆయన ట్విట్టర్లో నెమరువేసుకున్నారు. ఆనాడు సాగరహారంలో పాల్గొన్న ఫొటోలను షేర్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ నాయకత్వంలో పతాక స్థాయికి తీసుకెళ్లిన సందర్భం.. లక్షల గొంతుకలు జై తెలంగాణ అని నినదించిన రోజు అంటూ గుర్తు చేశారు. ప్రతిపక్ష నాయకులు ఆ ఉద్యమంలో ఎక్కడ ఉన్నారో చెప్పాలంటూ సవాల్ విసిరారు.
సెప్టెంబర్ నెలతో తన ప్రజా జీవితానికి 16 యేండ్లు పూర్తయ్యాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. 2006 సెప్టెంబర్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినట్టు ట్విట్టర్లో తెలిపారు. ఉద్యమంలో ఎనిమిది సంవత్సరాలు, ప్రభుత్వంలో ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నానని, ఎన్నో అనుభవనాలు, జ్ఞాపకాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 2006 సెప్టెంబర్లో తాను పాల్గొన్న బైక్ ర్యాలీ ఫొటోను కేటీఆర్ షేర్ చేశారు. తనను ఆదరించిన తెలంగాణ ప్రజలకు, క్షేత్ర స్థాయిలోని టీఆర్ఎస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. చారిత్రక తీర్పు అబార్షన్లపై సుప్రీంకోర్టు తీర్పును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని, చరిత్రాత్మక తీర్పును న్యాయస్థానం ఇచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. అబార్షన్లపై మహిళలకు ప్రొ-చాయిస్ ఆప్షన్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నానని తెలిపారు.
సాగరహారం జ్ఞాపకాలను ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్రావు గుర్తు చేసుకున్నారు. స్వరాష్ట్ర సాధనలో తూటాలకు.. టియర్ గ్యాస్కు, జలఫిరంగులకు ఎదురెళ్లిన చారిత్రక ఘట్టమైన సాగరహారానికి పది ఏండ్లు అంటూ ట్విట్టర్లో తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడటమే కాదు, ఆయనే రాష్ట్ర సారథిగా తెలంగాణ నేడు అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తూ కొత్త చరిత్రను సృష్టిస్తున్నదని పేర్కొన్నారు.