జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా మారింది. తెలంగాణలో ఎవరు పెట్టుబడులు పెట్టినా, ఆ తర్వాత భారతదేశం మొత్తం వేగంగా విస్తరించేందుకు మార్గం ఏర్పడుతుంది. తెలంగాణలో అద్భుత అవకాశాలున్నాయి. వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు వాటిని గుర్తించాలి. అనేక దేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న లులు గ్రూపు తెలంగాణలో మరింత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలి. వారికి ప్రభుత్వం అన్నివిధాలుగా మద్దతు, ప్రోత్సాహం అందిస్తుంది.
తెలంగాణలో ఎవరు పెట్టుబడులు పెట్టినా, ఆ తర్వాత భారతదేశం మొత్తం వేగంగా విస్తరించేందుకు మార్గం ఏర్పడుతుంది. తెలంగాణలో అద్భుత అవకాశాలున్నాయి. వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు వాటిని గుర్తించాలి. అనేక దేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న లులు గ్రూపు తెలంగాణలో పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టాలి.
-ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
Lulu Group | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావటంలో మంత్రి కేటీఆర్ సంపూర్ణ అంకితభావంతో పనిచేస్తున్నారని లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ అన్నారు. ఆయన అంకితభావానికి, చిత్తశుద్ధికి తాను ఫిదా అయ్యానని చెప్పారు. హైదరాబాద్లోని కేపీహెచ్బీలో లులు గ్రూపు ఏర్పాటుచేసిన అతిపెద్ద మాల్ను యూసుఫ్ అలీతో కలిసి మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ హైదరాబాద్లో మొదటిసారి లులు మాల్ను ప్రారంభించడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. త్వరలో నగరంలో మాంసం ప్రాసెసింగ్తోపాటు ఎగుమతి ఆధారిత అత్యాధునిక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్థానిక ఫిషింగ్ పరిశ్రమకు మద్దతుగా సిరిసిల్లలో సముద్ర ఆహార సేకరణ, ప్రాసెసింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్లో భవిష్యత్తులో డెస్టినేషన్ షాపింగ్మాల్, మినీ మాల్స్, అగ్రికల్చర్ సోర్సింగ్, లాజిస్టిక్ హబ్లలో సేవలందించే ఆలోచనలో ఉన్నామని, వీటన్నింటి కోసం వచ్చే మూడేండ్లలో రూ.3,500 కోట్లు పెట్టుబడి పెడుతున్నామని వివరించారు. తమ పెట్టుబడులకు సహకరించిన మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ‘దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశంలో తొలిసారి మంత్రి కేటీఆర్ను కలిశాను. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడంలో ఆయన ఎంతో అంకిత భావంతో కృషి చేస్తున్నారు. అది నన్ను ఎంతగానో ఆకట్టుకొన్నది. కేటీఆర్ ప్రోత్సాహంతో తెలంగాణలో మా వ్యాపారాలను దశలవారీగా విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపారు.
జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం స్వర్గధామంగా మారిందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఎవరు పెట్టుబడులు పెట్టినా, ఆ తర్వాత భారతదేశం మొత్తం వేగంగా విస్తరించేందుకు మార్గం ఏర్పడుతుందని తెలిపారు. తెలంగాణలో అద్భుత అవకాశాలున్నాయని, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు వాటిని గుర్తించాలని సూచించారు. అనేక దేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న లులు గ్రూపు తెలంగాణలో పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టాలని, వారికి ప్రభుత్వం అన్నివిధాలుగా మద్దతు, ప్రోత్సాహం అందిస్తుందని హామీ ఇచ్చారు. లులు పెట్టబడితో రాష్ట్రంలో ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా వందలమందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెడుతున్నందుకు లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం లులు గ్రూప్ రాష్ట్రంలో రూ.3,500 కోట్ల పెట్టుడులు పెడుతున్నదని, అంతటితో ఆగకుండా మరిన్ని పెట్టుబడులతో రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కే నవీన్రావు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీఎస్టీఎస్ చైర్మన్ పాటిమీద జగన్మోహన్రావు, లులు గ్రూపు ప్రతినిధులు పాల్గొన్నారు.
లులు గ్రూపు యూఏఈలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేస్తున్నది. భారత్ చెందిన యూసుఫ్ అలీ యూఏఈ కేంద్రంగా లులు గ్రూపును ఏర్పాటుచేసి 270 హైపర్ మార్ట్లను నిర్వహిస్తున్నారు. 25 పైచిలుకు దేశాల్లో వ్యాపారాలను విస్తరించి వేలమందికి ఉపాధి కల్పిస్తున్నారు. మనదేశంలో కేరళతోపాటు ఇతర రాష్ర్టాల్లో మాల్స్ ప్రారంభించారు. సూపర్ మార్కెట్లతోపాటు ఆహార శుద్ధి, ఫిషింగ్ తదితర రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.