తెలంగాణలో ఇంటింటికీ నల్లా కనెక్షన్లు మీరిచ్చినవి కావు
అబద్ధపు ప్రచారం ఎన్పీఏ ప్రభుత్వానికి సిగ్గుచేటు
మంత్రి కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరందిస్తున్నది ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మానస పుత్రిక లాంటి మిషన్ భగీరథ పథకం ద్వారా అని, కేంద్రప్రభుత్వం ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ ద్వారా కాదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. రాష్ట్రంలో 54 లక్షల ఇండ్లకు జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీరు అందిస్తున్నట్టు కేంద్రప్రభుత్వం సిగ్గు లేకుండా అబద్ధపు ప్రచారం చేసుకొంటున్నదని మండిపడ్డారు. సాక్షాత్తు పార్లమెంట్లోనే మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర మంత్రులు అభినందించారని గుర్తుచేశారు.
‘జలపాతాలకు ప్రసిద్ధి చెందిన తెలంగాణలో జల్ జీవన్ మిషన్ ద్వారా 54 లక్షల ఇండ్లకు కుళాయి నీటి కనెక్షన్లు అందించాం. ఇది రాష్ట్ర పౌరులకు శ్రేయస్సుతో కూడిన ఉజ్వల భవిష్యత్తును తీసుకువచ్చింది’ అని కేంద్ర జల్ శక్తి శాఖ ఆదివారం ట్వీట్ చేసింది. ఇదేవిధంగా శనివారం మీడియాలో ప్రకటనలు కూడా ఇచ్చింది. ఈ ప్రచారాన్ని మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ‘తెలంగాణ ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ మిషన్ భగీరథను భారత ప్రభుత్వం సిగ్గులేకుండా అపహరించి, దానిని తన సొంతం అని చెప్పుకొంటున్నది. మిషన్ భగీరథ కోసం రూ.19 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా ఒక్క పైసా ఇవ్వలేదు. ఇప్పుడు కేంద్రం చేసుకొంటున్న ఈ ప్రచారం ఎన్పీఏ (నాన్ పెర్ఫార్మింగ్ అసెట్) ప్రభుత్వానికి సిగ్గుచేటు’ అని ఆదివారం ఆయన ట్వీట్ చేశారు.