హైదరాబాద్, జూన్ 7(నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆవిర్భావోత్సవాల్లో పాల్గొనేందుకు మలేషియా వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సింగపూర్ ఎన్నారై ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆదివారం బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాలా ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అక్కడి అభివృద్ధి, పట్టణ ప్రణాళికల గురించి తెలుసుకున్నారు. ప్రజారవాణా, పారిశుధ్య నిర్వహణ, టెక్నాలజీ వినియోగంపై చర్చించారు. గతంలో కేసీఆర్ సింగపూర్, మలేషియా పర్యటనల సందర్భంగా అక్కడి డెవలప్మెంట్ పాలసీలు, అధ్యయనం చేసిన విషయాలను గుర్తుచేశారు. ఆ దేశాల అభివృద్ధి విధానాల్లో తెలంగాణ అనుసరించదగిన అంశాలపై విస్తృతంగా చర్చించారు.
తెలంగాణను ప్రపంచస్థాయి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ ప్రమాణాల నమూనాలను తీసుకురావాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఈ సందర్భంగా సింగపూర్లో తెలంగాణ ఆవిర్భావ సభ నిర్వహించాలని వారు కోరగా, కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. కాగా, తెలంగాణ, తెలుగు సంఘాల ప్రతినిధులు, తెలంగాణ కల్చరల్ సొసైటీ బాధ్యులు బీఆర్ఎస్ ఎన్నారై సభ్యులు, సింగపూర్ వాసవి సభ్యులు ప్రత్యేక బస్సుల్లో వచ్చి కేటీఆర్ను కలువడం విశేషం. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్, పార్టీ నేతలు మంచిరెడ్డి ప్రశాంత్, బీఆర్ఎస్ సింగపూర్ సభ్యులు రంజిత్రావు, పెద్ది శేఖర్, రజనీకాంత్, కిరణ్ షెర్ల, టీసీఎస్ఎస్ మెంబర్లు నల్లా భాస్కర్, రాజు, వీఏఎం మెంబర్స్ కైల నాగరాజు, రమణ, ఎస్టీఎస్ మెంబర్లు కోటిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, బైరి రవి పాల్గొన్నారు.