హైదరాబాద్ : మహనీయుడు అంబేద్కర్.. ‘బోధించు.. సమీకరించు.. పోరాడు’ అనే తత్వాన్ని అనుసరించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాల వికాసం కోసం, సమాజంలో సమానత్వం కోసం కృషి చేశారని కీర్తించారు. మంగళవారం అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్.. ఆ మహనీయుడి ఆశయాలు, సమాజానికి ఆయన చేసిన మేలు గురించి వివరించారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అంబేద్కర్ మార్గాన్నే అనుసరించారని కేటీఆర్ చెప్పారు. ‘బోధించు.. సమీకరించు.. పోరాడు’ అనే అంబేద్కర్ తత్వాన్ని అనుసరించి.. కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను ప్రజలకు బోధించారని, అందుకోసం లక్షల మందిని సమీకరించారని, అందరినీ కలుపుకుని పోరాడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేశారని గుర్తుచేశారు.
అంబేద్కర్ విద్యతోనే వికాసం, విద్యతోనే సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందనే గొప్ప మాట చెప్పారని, అందుకు అనుగుణంగానే కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తదితరులతో సహకారాన్ని తీసుకొని రాష్ట్రంలో పేదల కోసం పెద్ద సంఖ్యలో గురుకులాలను నెలకొల్పారని గుర్తుచేశారు.