ఫార్మా దిగ్గజంతో మంత్రి భేటీ
హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): ఫార్మారంగంలో అత్యుత్తమ గమ్యస్థానంగా ఎదిగిన హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలని.. ఔషధాల తయారీ, డయాగ్నొస్టిక్స్లో ప్రపంచ అగ్రగామి సంస్థ రోచె చైర్మన్ డాక్టర్ క్రిస్టోఫ్ ఫ్రాంజ్ను ఐటీ పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ఆహ్వానించారు. దావోస్లోని తెలంగాణ పెవిలియన్లో క్రిస్టోఫ్తో భేటీ అయిన మంత్రి కేటీఆర్.. ఫార్మారంగంలో రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి, ఎకో సిస్టం గురించి వివరించారు. హైదరాబాద్లో ఫార్మాసిటీ, జీనోమ్వ్యాలీ, మెడ్టెక్ పార్క్ వంటి ప్రాజెక్టుల గురించి పేర్కొన్నారు.
నాణ్యమైన మందుల అభివృద్ధి, రోగుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో తెలంగాణ ప్రభుత్వ నిబద్ధతను తెలియజేశారు. రోచె ప్రపంచంలోనే అతిపెద్ద బయోటెక్ కంపెనీ. ఫార్మాస్యూటికల్స్, డయాగ్నోస్టిక్స్లో అగ్రగామి సంస్థ. ముఖ్యంగా విట్రో డయాగ్నొస్టిక్స్, టిష్యూ-బేస్డ్ క్యాన్సర్ డయాగ్నొస్టిక్స్కు ప్రసిద్ధి చెందింది. ఆంకాలజీ, ఇమ్యునాలజీ, ఇన్ఫెక్షన్ల ద్వారా వచ్చే వ్యాధులు, ఆప్తాల్మాలజీ, కేంద్ర నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులకు విభిన్నరకాల ఔషధాలను అభివృద్ధి చేస్తుంది. అంతేకాకుండా మధుమేహం నియంత్రణలోనూ ముందున్నది. డౌ జోన్స్ సస్టెయినబిలిటీ ఇండెక్స్(డీజేఎస్ఐ)లో ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో పదేండ్లపాటు గ్రూప్ లీడర్గా గుర్తింపు పొందింది.