రాజన్న సిరిసిల్ల, మార్చి 6 (నమస్తే తెలంగాణ)/సిరిసిల్ల రూరల్: ‘కేసీఆర్ను తిడితే ఓట్లు పడుతాయనుకోవడం పాత స్టయిల్. ఈ దేశానికి, ప్రజలకు ఏమి చేశారో చెప్పి ప్రజల మనసు గెలుచుకోవాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్ని ప్రజలుగా చూశారే తప్ప కుల, మతాల పేరుతో విభజించి రాజకీయాలు చేయలేదు. ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా పేదవాడు పేదవాడే. వారిని దృష్టిలో పెట్టుకుని ఆయన తీసుకున్న ఎన్నో నిర్ణయాల వల్ల దేశంలో ఎక్కడా లేని విధంగా బ్రహ్మాండంగా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఏ పేదవాడైనా పేదరికంలో నుంచి బయటపడాలంటే విద్యకు మించిన సాధనం లేదు.
అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్యాబోధన, మెరుగైన వైద్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కులమేదైనా, మతమేదైనా గురుకులాల ద్వారా మంచి శిక్షణతో పేదింటి పిల్లలను ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తీర్చిదిద్దేలా సీఎం కేసీఆర్ ప్రభుత్వం అంకితభావంతో ముందుకుపోతున్నది’ అని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు. సోమవారం ఆయన సిరిసిల్ల జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో రూ.20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానను, సిరిసిల్లలో రూ.1.10 కోట్లతో నిర్మించిన షాదీఖానను ప్రారంభించారు. అనంతరం సిరిసిల్ల ప్రెస్క్లబ్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. రగుడు జంక్షన్ సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గత ఎనిమిదేండ్లలో సిరిసిల్లలో మెడికల్, ఇంజినీరింగ్, వ్యవసాయ, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలతో విద్యారంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్దేనని చెప్పారు.
కేజీ టు పీజీ కళాశాలను తెచ్చామని, పల్ల్లె దవాఖానలు, ఇతర ప్రభుత్వ దవాఖానలను నిర్మించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని స్పష్టంచేశారు. ‘హిందూ, ముస్లిం పేరుతో గెలిచి పంచాయితీలు పెట్టేటోళ్లు కొంతమంది ఉంటరు. వాళ్ల ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. నాణ్యమైన విద్య కోసం ప్రతి జిల్లాలో పాఠశాలలు, మెరుగైన వైద్యం కోసం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. హెల్త్ప్రొఫైల్, ఉచిత డయాగ్నోస్టిక్స్, కేసీఆర్ కిట్ వంటి సేవలందిస్తున్నామని వివరించారు. శుభకార్యాలు నిర్వహించుకొనేలా కమ్యూనిటీ హాళ్లు, షాదీఖానలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఎవరు కోరినా కుల, మతాలకతీతంగా అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని స్పష్టం చేశారు.
ఆశ కార్యకర్తల సేవలు వెలకట్టలేనివి
కరోనా కష్టకాలంలో ఆశ కార్యకర్తలు అందించిన సేవలు వెలకట్టలేనివని మంత్రి కేటీఆర్ అభినందించారు. ఆశలకు ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కన్నా తెలంగాణలో అత్యధిక వేతనాలు ఇస్తున్నామని గుర్తుచేశారు. ఆర్థిక పరిస్థితి కుదటపడగానే వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. స్వలాభం కోసం సంఘాలు రెచ్చగొడితే ఆలోచించాలని సూచించారు. ఆశ కార్యకర్తలను ప్రభుత్వం కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలన్నది సర్కారు ఉద్దేశమని, మెరుగైన సేవలందించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని వివరించారు.
రూ.6 వేల కోట్లతో విద్యాబోధన
కులం, మతం అన్న బేధం లేకుండా అన్ని వర్గాల పిల్లలు ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యాబోధన అందిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. మైనార్టీలకు చెందిన ఆడపిల్లలు చదువుకుని ఉన్నతంగా రాణించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మైనార్టీ పాఠశాలలతో పాటు ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేసిందని చెప్పారు. గురుకులాలకు ఏటా రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఒక్కో విద్యార్థికి రూ.1.20 లక్షలు ఖర్చు పెడుతున్నామని వివరించారు. విదేశీ చదువుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ.20 లక్షలు అందజేస్తున్నామని గుర్తచేశారు. రాష్ట్రం నుంచి 7 వేల మంది విద్యార్థులు విదేశాల్లో చదువుకుంటున్నారని చెప్పారు.
సర్కారు దవాఖానలకు క్యూ
నేను రాను బిడ్డో సర్కారు దవఖానకు అన్న పాట గతంలో సినిమాలో చూశామని, ఇప్పుడు నేను పోత అవ్వో సర్కారు దవాఖానకు అంటూ గర్భిణులంతా క్యూ కడుతుండటం ప్రభుత్వ వైద్య సేవలకు నిదర్శనమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.