హైదరాబాద్ : ఆఫీస్ స్పేస్ లీజు విషయంలో హైదరాబాద్ నగరం బెంగుళూరును దాటిపోయిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పుడు హైదరాబాద్కు భారతీయ నగరాలు పోటీకానేకాదని, హాంకాంగ్, సింగపూర్ వంటి ప్రపంచస్థాయి నగరాలతోనే పోటీ అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణ సృష్టి, వ్యాపార అనుకూల విధానాలను నిరంతరం కొనసాగించడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. హైటెక్ సిటీలో కేటీఆర్ సోమవారం రెండు సాఫ్ట్వేర్ కంపెనీలు ష్యూరిఫై ల్యాబ్స్ టెక్నాలజీ, కొలియర్ల నూతన కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
హైదరాబాద్లో 2012-13లో రెండు మిలియన్ల చదరపు అడుగుల పైచీలుకు కమర్షియల్ లీజ్ స్పేస్ ఉందని, గత ఏడాది 11 మిలియన్ చదరపు అడుగుల లీజ్ స్పేస్కు చేరుకుందని తెలిపారు. దీన్నిబట్టి హైదరాబాద్ ఎంత వేగంగా, ఎంత బలంగా అభివృద్ధివైపు దూసుకుపోతున్నదో అర్థం చేసుకోవచ్చన్నారు. ఏడేళ్ల క్రితం అమీర్పేట్లో ష్యూరిఫై కేవలం ఒకరితో కార్యాలయాన్ని ఏర్పాటుచేయగా, నేడు 230కిపైగా ఉద్యోగులు అందులో పనిచేస్తున్నట్లు కంపెనీ సీఈఓ డస్టిన్ చెప్పారని, నగరాభివృద్ధికి, ఇక్కడున్న వ్యాపార అనుకూలతలకు ఇది మరో నిదర్శనమన్నారు.
హైదరాబాద్ నగరం ఒక ఐటీలోనే కాకుండా అనేక రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నదన్నారు. ఐటీతోపాటు జీవశాస్త్రాలు, ఏరోస్పేస్, డిఫెన్స్ తదితర రంగాల్లో ఎంతగానో పురోగతి సాధించినట్లు చెప్పారు. ప్రభుత్వ పరంగా పరిశ్రమలు, పెట్టుబడిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తున్నట్లు, ఎంత వేగంగా అభివృద్ధి జరుగుతుందో, అంతే వేగంగా తాము అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో నేడు విద్యుత్ కోతలు లేవని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు.
ఎక్కువమంది హైదరాబాద్కు పశ్చిమం వైపునే దృష్టి కేంద్రీకరిస్తున్నారని, పశ్చిమం వైపునే కాకుండా ఇతర ప్రాంతాల వైపు కూడా ఎదుగుదలకు అవకాశాలున్నాయన్నారు. ఇటీవలే ఉత్తరం వైపు ఐటీ గేట్వే పార్కును ప్రారంభించినట్లు, తూర్పు వైపున కూడా కంపెనీల ఏర్పాటునకు అనేక అవకాశాలున్నాయన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున కంపెనీలు తూర్పు వైపునకు వస్తున్నాయన్నారు. ఒకే ప్రాంతంలో అభివృద్ధి కాకుండా నగరం నలువైపులా అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. కంపెనీలు ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా ఎక్కడినుంచైనా కార్యకలాపాలు సాగించవచ్చని కొవిడ్ వల్ల అర్థమైందన్నారు.
కొవిడ్ కాలంలో వర్క్ ఫ్రం హోమ్ సంస్కృతి పెరిగిందన్నారు. అలాగే, హైబ్రిడ్ పద్ధతి ఎక్కువగా అమల్లోకి వచ్చిందన్నారు. దీంతో కంపెనీలను విస్తరించాలనే ఉద్దేశంతో ఒక హైదరాబాద్కే కంపెనీలు పరిమితం కాకుండా వరంగల్, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్ తదితర టైర్-2 నగరాలపై దృష్టి పెట్టామన్నారు. ఆయా నగరాల్లో కూడా అవసరమైన పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని, కంపెనీలు టైర్-2 నగరాలకు వెళ్లాలని పిలుపునిచ్చారు. కొవిడ్తో నగరాలు, పల్లెటూర్ల మధ్య అంతరాలు చెరిగిపోయాయని, టైర్-2 నగరాలకు వెళ్లే కంపెనీలకు ప్రభుత్వ పరంగా అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
హైదరాబాద్లో జరుగుతున్న అభివృద్ధి ప్రపంచంలో ఎక్కడా లేదని, మంత్రి కేటీఆర్ నాయకత్వ పటిమతోనే ఇది సాధ్యమైందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూలంగా మంచి సాంప్రదాయాన్ని సృష్టించారని, సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో, మంత్రి కేటీఆర్ నిరంతర కృషితో అభివృద్ధి వేగవంతంగా సాగుతున్నదన్నారు. ఐటీతోపాటు అంతకుమించి మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధిలో సింగపూర్తో పోల్చగలిగే స్థితికి వచ్చిందన్నారు. ఐటీకీ ప్రోత్సాహమిస్తూ, ఐటీ రంగాన్ని నగరానికి తేవడంలో, ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా తీర్చుకుంటూ హైదరాబాద్ను పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దారని కొనియాడారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త బీవీఆర్ మోహన్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో స్టార్టప్ల పర్యావరణ వ్యవస్థ లేదని, కొత్త పెట్టుబడుల రాక అసలు ఉండేది కాదని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధి, పెట్టుబడులను రాబడుతున్న ఘనత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకే దక్కుతుందన్నారు. ష్యూరిఫై సీఈఓ డస్టిన్ మాట్లాడుతూ ఏడేళ్ల క్రితం అమీర్పేట్లో ఒక వ్యక్తితో కార్యాలయాన్ని ప్రారంభించామని, ఇప్పుడు హైటెక్సిటీలో రెండో కేంద్రాన్ని ఏర్పాటుచేశానన్నారు. అమెరికా సహా తన మూడు కంపెనీల్లో 320మంది పనిచేస్తుండగా, అందులో 220మంది హైదరాబాద్లోనే పనిచేస్తున్నారన్నారు. హైదరాబాద్లో వ్యాపార అనుకూలత ఉందని, ముఖ్యంగా మంత్రి కేటీఆర్ సహకారం ఎంతో ఉందని ఆయన కొనియాడారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఎమ్మెల్యే బాల్కా సుమన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.