సిరిసిల్ల రూరల్, అక్టోబర్ 27: ఏజెంట్ మోసంతో గల్ఫ్ దేశంలో చిక్కుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్కు చెందిన బాలసాని గౌరయ్య అలియాస్ సతీశ్ ఎట్టకేలకు సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక చొరవతో స్వగ్రామానికి చేరుకున్నాడు. బస్వాపూర్కు చెందిన బాలసాని గౌరయ్య రెండు నెలల క్రితం గల్ఫ్ దేశమైన ఓమన్ (మస్కట్)లో ఏజెంట్ మోసంతో చిక్కుకున్నాడు.
ఆరోగ్యం సహకరించక పోవడంతో పనిచేయలేక దయనీయ పరిస్థితిలో తనను స్వదేశానికి తీసుకెళ్లాలని, ఏజెంట్ మోసం, కంపెనీ నిర్వాహకుల వేధింపుల గురించి సోషల్ మీడియాలో తనగోడు వెళ్లబోసుకున్నాడు. గౌరయ్య పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విషయాన్ని పార్టీ నాయకుల ద్వారా మాజీ మంత్రి కేటీఆర్ తెలుసుకున్నారు. గౌరయ్యను స్వదేశానికి తీసుకువచ్చేలా ఈ నెల 12న ఓమన్ ఎంబీసీకి లేఖ రాశారు. అక్కడే ఉన్న సామాజిక సేవా కార్యకర్త షేక్అహ్మద్ని సైతం న్యాయసాయం చేయాలని కోరారు.
ఈ క్రమంలో షేక్అహ్మద్ వెంటనే కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరపడంతో కంపెనీ ప్రతినిధులు గౌరయ్యకు పాస్పోర్టు తిరిగి అందజేశారు. గౌరయ్యను స్వదేశానికి తీసుకు రావడానికి విమాన ఖర్చుల కోసం కేటీఆర్ నగదు పంపించారు. దీంతో గౌరయ్య ఆదివారం అక్కడ నుంచి బయలుదేరి సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకోగా.. బీఆర్ఎస్ నాయకులు బొడ్డు శ్రీధర్, గడ్డం శేషాద్రి ఆయనకు స్వాగతం పలికారు.
ఉదయం 10గంటలకు కారు లో బస్వాపూర్లోని ఇంటికి తీసుకెళ్లారు. భార్య శారద, కొడుకు వరుణ్తేజ్, కూతురు అవంతికను చూడగానే గౌరయ్య భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతమయ్యాడు. తనను స్వదేశానికి తీసుకువచ్చిన కేటీఆర్కు తాము జీవితాంతం రుణపడి ఉంటామన్నాడు. సహకరించిన సామాజిక సేవా కార్యకర్త షేక్అహ్మద్, బీఆర్ఎస్ నాయకులు బొడ్డు శ్రీధర్, గడ్డం శేషాద్రి, మిత్రులకు కృతజ్ఞతలు తెలిపాడు.