Minister KTR | హైదరాబాద్, ఆగస్టు 26(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరాన్ని హెల్త్టెక్ హబ్గా తీర్చుదిద్దుతున్నామని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అమెరికాలోని పారిశ్రామికవేత్తలను కోరారు. హైదరాబాద్లోనే కాకుండా రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో సైతం ఐటీతోపాటు వివిధ రంగాలను అభివృద్ధి చేస్తున్నామని, ఆయా నగరాల్లో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ శనివారం చికాగోలో వివిధ ప్రపంచస్థాయి కంపెనీలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. వైద్య పరికరాలు, కృత్రిమమేథ రంగంలో అగ్రగామి సంస్థ అలైవ్కోర్ ప్రతినిధులతోనూ, అట్లాంటాలోని హెల్త్-టెక్ కంపెనీ కారెలోన్ ప్రెసిడెంట్ రజత్పురి, ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయ ప్రాసెసింగ్ కంపెనీ ఆర్చర్ డేవియర్స్ మిడ్ల్యాండ్ (ఏడీఎం) చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ విక్రమ్ లూథర్, ఇల్లినాయిస్ స్టేట్ ఫస్ట్ అసిస్టెంట్ డిప్యూటీ గవర్నర్ క్రిస్టీజార్జ్, చికాగో వాణిజ్య కార్యదర్శి క్రిస్టిన్ రిచర్డ్స్తోపాటు చికాకో వరల్డ్ బిజినెస్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పారిశ్రామిక రంగంలో తెలంగాణ సాధించిన అభివృద్ధి, ప్రభుత్వం అమలుచేస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలను మంత్రి కేటీఆర్ వారికి వివరించారు. ఎన్నో అనుకూలతలు ఉన్న తెలంగాణలో కార్యకలాపాలు చేపట్టాలని విజ్ఞప్తిచేశారు.
మంత్రి కేటీఆర్తో చికాగోలో సమావేశమైన అలైవ్కోర్ ప్రతినిధులు తెలంగాణలో మెడ్టెక్ అభివృద్ధికి సహకకరించేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. త్వరలో తెలంగాణతో భాగస్వామ్యం అయ్యేందుకు అలైవ్కోర్ సిద్ధంగా ఉన్నదని, దీంతో తెలంగాణలో మెడ్టెక్ రంగం మరింత వృద్ధి చెందే అవకాశం ఉన్నదని తెలిపారు. గుండెకు సంబంధించిన వ్యాధులను పసిగట్టేందుకు అలైవ్కోర్ రూపొందించిన ఈసీజీ-టెక్ విప్లవాత్మకమైనదని ప్రశంసించారు.
అట్లాంటాలోని హెల్త్టెక్ కంపెనీ కారెలోన్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రజత్పురితో కూడా మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి, ఐటీ రంగం సాధించిన ప్రగతి, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పర్యావరణ అనుకూల విధానాలను మంత్రి కేటీఆర్ ఆయనకు వివరించారు. కారెలోన్కు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారిందని, గత మూడున్నరేండ్లలో 8,000లకుపైగా అత్యధిక వేతనాలు ఇచ్చే ఉద్యోగాలను సృష్టించడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. వచ్చే మూడు నుంచి ఐదేండ్లలో ఇదేవిధమైన వృద్ధి ప్రణాళికతో కారెలోన్ ఉండటం సంతోషకరమని పేర్కొన్నారు.
ఇల్లినాయిస్ స్టేట్ ఫస్ట్ అసిస్టెంట్ డిప్యూటీ గవర్నర్ క్రిస్టీజార్జ్, చికాగో వాణిజ్య కార్యదర్శి క్రిస్టిన్రిచర్డ్స్తోపాటు చికాకో వరల్డ్ బిజినెస్ ప్రతినిధులతో సమావేశమైన కేటీఆర్ బృందం.. క్లిన్టెక్, సస్టెయినబుల్ మొబిలిటీ, లైఫ్సైన్సెస్, విమానయాన, వ్యవసాయ తదితర రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై చర్చించింది. విద్యాపరమైన భాగస్వామ్యం, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ బలోపేతానికి పరస్పరం సహకరించుకోవాలని ఇరుపక్షాలు అంగీకరించాయి.
చికాగోలోని ప్రపంచంలోనే అగ్రశ్రేణి బిజినెస్ స్కూల్ ‘చికాగో బూత్ స్కూల్’ డీన్ ప్రొఫెసర్ మాధవ్రంజన్తో కేటీఆర్ సమావేశమయ్యారు. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో విద్యాసంస్థల పరస్పర సహకారం ఆవశ్యకతపై చర్చించారు. ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూసివ్ అనే మూడు అంశాల ద్వారా రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక రంగాల్లో సాధించిన అభివృద్ధిని కేటీఆర్ వివరించారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నంబర్-1గా నిలిచిందని చెప్పారు. హైదరాబాద్ ఐఎస్బీ తరహాలో ఇతర విద్యాసంస్థలతో కూడా బూత్స్కూల్ ఎక్సేంజ్ ప్రోగ్రామ్లు నిర్వహించే అంశాన్ని, భాగస్వామ్యం ఏర్పాటుచేసుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కేటీఆర్ కోరారు.
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయ ప్రాసెసింగ్ కంపెనీ ఆర్చర్ డేవియర్స్ మిడ్ల్యాండ్ (ఏడీఎం) చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ విక్రమ్ లూథర్తో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతి, తద్వారా ఆర్థిక, సామాజిక రంగాల్లో వచ్చిన మార్పులను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రతినిధి బృందం ప్రెజెంటేషన్ ద్వారా వివరించింది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, ఆర్అండ్డీ ఏర్పాటు తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తిచేసింది. తెలంగాణలో తమ కార్యకలాపాలు గణనీయంగా పెంచుకునేందుకు ఈ సందర్భంగా విక్రమ్ సంసిద్ధత వ్యక్తంచేశారు.