హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): ఓ నిరుపేద గిరిజన విద్యార్థిని వైద్య విద్యకు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. కరోనా పరిస్థితులతో విద్యార్థినికి తలెత్తిన ఆర్థిక ఇబ్బందులను చూసి చలించిపోయారు. ‘ఎంబీబీఎస్ ఫీజు బాధ్యతను నేనే తీసుకుంటాను. వెళ్లి డాక్టర్గా తిరిగి రా’ అని ఆల్ ది బెస్ట్ చెప్పారు. హైదరాబాద్ బోరబండ ప్రాంతానికి చెందిన తిరుపతి అనూష కిర్గిజిస్థాన్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నది. మొదటి, రెండు సంవత్సరాల ఫీజు చెల్లించేందుకు డబ్బు లేకపోవడంతో కుటుంబసభ్యుల బంగారు ఆభరణాలు అమ్మేశారు. అనూష ఎంతో కష్టపడి రెండేండ్ల చదువు పూర్తిచేసింది. పట్టుదలతో 95 శాతం మారులతో ప్రతిభ కనబరిచింది. విద్యార్థిని ప్రతిభ చూసిన కళాశాల యాజమాన్యం మూడో సంవత్సరం పరీక్షలు రాసేందుకు అనుమతిచ్చింది. కానీ, కరోనా ఉద్ధృతి సమయంలో అనూష హైదరాబాద్లోని ఇంటికి వచ్చింది. తిరిగి వెళ్లేందుకు ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. ఫీజు చెల్లించేందుకు డబ్బుల్లేవు. వేరే దారిలేక తల్లితోపాటు అనూష కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నది. ఆమె తండ్రి వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. అనూష చదువులకు మధ్యలోనే స్వస్తిపలికే పరిస్థితులు నెలకొన్నాయి. వైద్య విద్య ఫీజు కోసం అనూష ఇబ్బందులు పడుతున్న విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది. అనూష కుటుంబ నేపథ్యం, పట్టుదల గురించి తెలుసుకొని సాయం చేసేందుకు ముందుకొచ్చారు. అనూష విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు అండగా ఉంటానని చెప్పారు. ఎంబీబీఎస్ ఫీజుల బాధ్యత తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. బుధవారం ఆమె వైద్య విద్యకు అవసరమైన ఆర్థికసాయం అందజేశారు. అనూష డాక్టర్గా తిరిగి రావాలని ఆకాంక్షించారు. వైద్యవిద్య చదువుకునేందుకు అండగా నిలిచిన మంత్రి కేటీఆర్కు అనూష కృతజ్ఞతలు తెలిపారు.