కేసీఆర్ విప్లవాత్మక ఆలోచనా విధానంతో పురోగమిస్తున్న తెలంగా ణను చూసి దేశం గర్వపడుతున్నది.. ఇంతటి ప్రతిభావంతమైన పాలనను గేలిచేస్తున్న వాళ్లకు దిమ్మతిరిగే రీతిలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది.
-టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): దేశానికే ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎవరైనా అవాకులు చెవాకులు పేలితే వేయి గొంతుకలై గర్జించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 60 ఏండ్లు ఏమీచేయని వాళ్లే ఎగిరెగిరి పడుతుంటే.. అన్నీ చేసిన మనమెందుకు ఉదాసీనంగా ఉండాలని ప్రశ్నించారు. అవతలివాడు మనల్ని ఒక్కటంటే.. మనం తిరిగి వందింతలు అనేంతగా పనులు చేస్తున్నామని వివరించారు. వచ్చే నెల 15న వరంగల్లో తెలంగాణ విజయగర్జన సభ నిర్వహించనున్న నేపథ్యంలో సోమవారం ఆయన ప్రగతిభవన్లో 20 నియోజకవర్గాల ముఖ్యనేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 20 ఏండ్ల టీఆర్ఎస్ ప్రస్థానాన్ని వివరించారు. కేంద్రం మెడలు వంచి, తెలంగాణను సాధించుకొన్న క్రమాన్ని గుర్తుచేశారు. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ అహోరాత్రులు శ్రమిస్తున్నారని, దీనిని ప్రతి కార్యకర్త గర్వంగా చెప్పుకోవాలని అన్నారు. కేసీఆర్ విప్లవాత్మక ఆలోచనా విధానంతో పురోగమిస్తున్న తెలంగాణను చూసి దేశం గర్వపడుతున్నదని పేర్కొన్నారు. ఇంతటి ప్రతిభావంతమైన పాలనను గేలిచేస్తున్న వారికి దిమ్మతిరిగే రీతిలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని దిశానిర్దేశం చేశారు. ప్రపంచం ఆశ్చర్యపోయేలా, దేశం గర్వపడేలా రాష్ట్రం పురోగమిస్తుంటే.. కండ్లు కుట్టిన కొంతమంది నోరుపారేసుకుంటే మనమెందుకు చూస్తూ ఉండాలని ప్రశ్నించారు. 60 ఏండ్ల పాలనలో తెలంగాణకు ఒరిగింది గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఏడేండ్ల పాలనలో సాధించిన అద్భుతాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉన్నదని ఉద్బోధించారు. మంత్రులో, ఎమ్మెల్యేలో, ఫలానావాళ్లో మాట్లాడాలనే భావనతో ఊరుకోకుండా వేయిగొంతుకలు ఒక్కటిగా గర్జించాలని పిలుపు నిచ్చారు. పార్టీ బాగుంటేనే మనం బాగుంటామని చెప్పారు. పార్టీని, నాయకుడిని ఎక్కడైనా, ఎవరైనా, ఏదైనా అంటే అక్కడికక్కడే బాధ్యతగల కార్యకర్తలుగా స్పందించాలని సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కర్ణాటకలోని రాయచూర్, మహారాష్ట్రలోని నాందేడ్ ప్రజలు తాము తెలంగాణలో కలుస్తామని తీర్మానాలు చేస్తుంటే.. మనం మాత్రం మన దగ్గర ఏం జరిగినా పట్టనట్టు ఊరుకోకూడదని హితవు పలికారు.
హుజూరాబాద్లో
ఎగిరేది గులాబీ జెండానే..
ఉప ఎన్నికలైనా..సాధారణ ఎన్నికలైనా తిరుగులేని అజేయశక్తి టీఆర్ఎస్సే అని కేటీఆర్ పేర్కొన్నారు. హుజూరాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తున్నారని ధీమా వ్యక్తంచేశారు. నాగార్జునసాగర్లో సీనియర్ నేత జానారెడ్డిని పెద్దగా అనుభవం లేని నోముల భగత్ ఓడించారని గుర్తుచేశారు. హుజూరాబాద్లోనూ అదే ఫలితం పునరావృతం అవుతుందని తేల్చిచెప్పారు. ప్రతి ఒక్క కార్యకర్త హుజూరాబాద్లోని తమ బంధువులు, స్నేహితులను కలిసి మద్దతు కోరాలని సూచించారు. గ్రామ పంచాయతీల నుంచి రాష్ట్రస్థాయి వరకు అన్ని స్థాయిల ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఎన్నిక ఏదైనా ప్రజలు టీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ను మాత్రమే విశ్వసిస్తున్నారని అనేక ఫలితాలు స్పష్టంచేశాయని గుర్తుచేశారు.
హాజరైన 20 నియోజకవర్గాల నేతలు
సోమవారం నిర్వహించిన సమావేశానికి సిరిసిల్ల, కోరుట్ల, దుబ్బాక, సంగారెడ్డి, వికారాబాద్, పరిగి, తాండూర్, చేవెళ్ల, సూర్యాపేట, హుజూర్నగర్, దేవరకొండ, తుంగతుర్తి, వనపర్తి, గద్వాల్, కొల్లాపూర్, అలంపూర్, కామారెడ్డి, బాన్స్వాడ, జుకల్, ఎల్లారెడ్డి, నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు, ఎంపీలు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి హాజరయ్యారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, మంత్రులు ప్రశాంత్రెడ్డి, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్రెడ్డి, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ సహ ఆయా నియోజకర్గ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మున్సిపల్ చైర్మన్లు, గ్రంథాలయ సంస్థల చైర్మన్లు, రైతుబంధు సమితి అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, పలువురు ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
గ్రామానికో బస్సు కదలాలి
తెలంగాణ విజయగర్జనకు ప్రతి గ్రామం నుంచి గ్రామ పార్టీ, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులంతా సంబురంగా పండుగ వాతావరణంలో తరలి రావాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎక్కడికక్కడ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో, బస్సులను బుక్చేసుకోవాలని సూచించారు. ఎంత పెద్ద నాయకుడైనా బస్సులోనే కార్యకర్తలతో కలిసి రావాలని స్పష్టంచేశారు. సన్నాహాక సమావేశాలకు హాజరైనవారు తెల్లారి నుంచే మండలాలు, గ్రామాలవారీగా సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. దీనిని ఆషామాషీగా తీసుకోవద్దని పార్టీ శ్రేణులను ఆదేశించారు. పార్టీ జెండా గద్దెలకు రంగులువేసి, జెండాను ఆవిష్కరించి సభకు రావాలని సూచించారు. ఈ నెల 25న హైదరాబాద్లో నిర్వహించే పార్టీ ప్లీనరీకి హాజరయ్యే పురుషులు గులాబీ రంగు షర్ట్లు, మహిళా ప్రతినిధులు గులాబీ కలర్ చీరలు కట్టుకొని రావాలని కేటీఆర్ సూచించారు.ఈ నెల 25న నిర్వహించే పార్టీ ప్లీనరీకి పార్టీ తరఫున హాజరయ్యే ప్రతినిధులకు ఆహ్వానం అందుతుందని చెప్పారు. ప్లీనరీ, బహిరంగసభ కార్యాచరణ కోసం గ్రామ, మండల స్థాయి కార్యకర్తల సమావేశాలను స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించాలని చెప్పారు. ఈ నెల 27న నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశాలు పూర్తిచేయాలని ఆదేశించారు.