Ktr | టీఆర్ ఎస్ ప్రభుత్వం ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని మంత్రి, టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు పేర్కొన్నారు. ఉద్యోగుల స్థానికత కోసమే 317 జీవోను ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులకు బీజేపీ ఏం చేసిందని ఆ పార్టీని నమ్ముతారని సూటిగా ప్రశ్నించారు. రైతుల విరోధిగా ప్రధాని నరేంద్ర మోదీ మారిపోయారని, పంజాబ్ లో రైతుల నిరసన తో పీఎం మోడీ ఎన్నికల సభను రద్దు చేసుకున్నారని అన్నారు. ఇంత దౌర్భాగ్యం ఏ ప్రధానికి కూడా దక్కలేదని కేటీఆర్ విరుచుకుపడ్డారు. బీజేపీ తాటాకు చప్పుళ్లకు బెదిరే వారెవ్వరూ లేరని, భయపడితే తెలంగాణ వచ్చేదా? అని అన్నారు. మార్కెట్లో బీజేపీకి వారికి భయపడేవారెవరైనా ఉండొచ్చని, తాము మాత్రం కచ్చితంగా బీజేపీ వెంటపడుతూనే ఉంటామని కుండబద్దలు కొట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ బాగుకోసం పడుతున్న తపనను ఎవరు అడ్డుకున్నా, ఆగదని, ఏ విషయంలోనూ తాము వెనక్కి తగ్గమని తేల్చి చెప్పారు.
ప్రజాస్వామ్యం గురించి బీజేపీ నేతలు మాట్లాడటం చూస్తుంటే తెగ నవ్వొస్తోందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ వేదికగా బీజేపీ రైతులను ఎంత ఇబ్బందులకు గురి చేసిందో, అందరికీ తెలుసని, లక్షలాది మంది రైతుల గోసవుచ్చుకున్న చరిత్ర బీజేపీదని ఆయన విమర్శించారు. కేంద్ర మంత్రి బలుపుతో రైతులను కారుతో తొక్కించి చంపినా, ఇప్పటి వరకు చర్యలు లేవని, అలాంటి బీజేపీ మా గురించి మాట్లాడడమా? అంటూ ఫైర్ అయ్యారు. ఓ వైపు జుమ్లా, మరోవైపు హమ్లా… వీటితో బీజేపీ జుగల్బందీ పాలన చేస్తోందంటూ విరుచుకుపడ్డారు. వారిని జుమ్లా పార్టీ అని విమర్శిస్తే తమపై హమ్లా చేస్తారని దెప్పిపొడిచారు. ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు భాగస్వామ్య పక్షాలుగా మారిపోయాయని కేటీఆర్ విరుచుకుపడ్డారు.