కష్టంలో చుట్టమై.. కంచంలో మెతుకై
అంశల స్వామికి ప్రేమ పంచిన కేటీఆర్
‘అమ్మా అన్నం పెట్టమ్మా’ అని అన్న అడిగితే.. నీకు పెట్టేంతటోళ్లమా అన్నా అన్నది ఆ చెల్లి.. నీ ఇంట్లో తినడానికే వచ్చిన అని ఇంట్లోకి వెళ్లి అక్కడి చాప మీదనే కూర్చున్నడు. ఆ తల్లి ఇంట్లో వండుకొన్న పప్పన్నం.. పచ్చిపులుసే తెచ్చిపెట్టింది.. దాన్నే పరమాన్నంగా భావించి కంచంలో తానే వడ్డించుకొన్నాడు. తనను అన్నా అని గుండెల నిండా పిలుచుకొన్న తమ్ముడికీ వడ్డించాడు. కడుపునిండా కమ్మని భోజనం పెట్టిన చెల్లికి చీర పెట్టి అన్న ప్రేమను పంచాడు.. ఆ అన్న.. రామన్న.. తమ్ముడు.. అంశల స్వామి.. చెల్లి.. స్వామి సోదరి రాజేశ్వరి..
నల్లగొండ జిల్లాలో ఇంటింటికీ కృష్ణా నీళ్లొచ్చాక అంశల స్వామి ఫ్లోరైడ్ వ్యతిరేక పోరాటం ఆగిపోయింది. మనుగడ కోసం పోరాటం మొదలైంది. చేతులు, కాళ్లు వంకర్లు తిరిగిపోయి ఫ్లోరైడ్ విషానికి చిరునామాగా మారిన స్వామి అడిగిందే తడవుగా కేటీఆర్ రూ.2.7 లక్షలతో సెలూన్ పెట్టించారు. గత ఏడాది శిథిలమై కూలిపోయేస్థితికి చేరిన ఇంటిఫొటో కేటీఆర్కు వాట్సాప్ చేయగానే, ప్రగతిభవన్కు పిలిచి డబుల్బెడ్రూం మంజూరుచేశారు. తనకు బతుకుదెరువు చూపి భవిష్యత్తుపై ఆశ కల్పించిన అన్నను ఇంటికి రావాలని స్వామి ఆహ్వానించాడు. గురువారం మునుగోడు ప్రచారానికి వచ్చిన కేటీఆర్, ఆ తమ్ముడి కోరిక తీర్చారు. అన్నలా మేడకట్టి నీడనిచ్చి, కంచంలో అన్నమై ప్రేమ పంచారు. స్వామికి అన్నం పెట్టి, పప్పువేసి, చారుపోసి ఆప్యాయత రుచిచూపారు. నీకేం కావాలన్నా నేనున్నానని భరోసా ఇచ్చారు. రామన్న ప్రేమతో శివన్నగూడెం శిగమూగింది.
(నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి)
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో గురువారం టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు.. కార్యక్రమం ముగిసిన తరువాత మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి మర్రిగూడ మండలం శివన్నగూడెంలో.. స్కెలెటిన్ ఫ్లోరోసిస్ బాధితుడు అంశల స్వామి ఇంటికి వెళ్లారు. స్వామికి శివన్నగూడెంలో డబుల్ బెడ్రూం ఇంటితోపాటు సెలూన్ కూడా మంత్రి కేటీఆర్ తానే స్వయంగా చొరవతీసుకొని ఏర్పాటుచేశారు. ఆపదలో ఉన్నప్పుడు అన్నా అనంగనే.. ఆప్యాయంగా ఆదుకొన్న మంత్రి కేటీఆర్.. నేరుగా స్వామి ఇంటికి చేరుకోగానే అందరూ ఆశ్చర్యపోయారు. మంత్రి వస్తున్నారన్న ఎలాంటి ముందస్తు సమాచారం లేదు. అకస్మాత్తుగా మంత్రి కేటీఆర్ తమ ఊళ్లోకి వచ్చేసరికి ప్రజలంతా ఆశ్చర్యపోయారు.
అంశల స్వామి ఇంటికి చేరుకొన్న తరువాత ఇంటి ముందు ఉన్న నల్లా తిప్పి చేతులు కడుక్కొన్నారు. ఇంట్లోకి వెళ్లి అందరినీ పలకరించారు. అప్పటికే బంగారిగడ్డ (చండూరు మండలం) నుంచి చండూరు పట్టణం వరకు నిర్వహించిన ర్యాలీ, సభల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ బాగా అలసిపోయి, ఆకలితో ఉన్నారు. స్వామి ఇంట్లోకి అడుగుపెట్టగానే ఆకలవుతున్నది అన్నం పెట్టండని స్వామి కుటుంబ సభ్యులతో అన్నారు. కుటుంబ సభ్యుడిగా వాళ్లతో కలిసిపోవడంతో అంతా ఆనందపడిపోయారు. కేటీఆర్తోపాటు మంత్రి జగదీశ్రెడ్డి, ఇంటి నిర్మాణాన్ని పర్యవేక్షించిన కర్నాటి విద్యాసాగర్, ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, నోముల భరత్, కంచర్ల భూపాల్ రెడ్డి, పైళ్ల శేఖర్రెడ్డి, జాబిరెడ్డి గోవర్ధన్రెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, టీఆర్ఎస్ నేత కంచర్ల కృష్ణారెడ్డి, ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ కంచుకట్ల సుభాష్.. స్వామి ఇంట్లో భోజనం చేశారు. వడ్డించుకోవడానికి శరీరం సహకరించని స్వామికి కేటీఆరే స్వయంగా వడ్డించారు. భోజనానంతరం స్వామికి ప్రభుత్వం అందించిన డబుల్ బెడ్రూమ్ ఇంటిని పరిశీలించారు. ప్రభుత్వ నిధులు చాలకపోతే ఇంకొన్ని డబ్బు లు అందిస్తానని హామీ ఇచ్చారు. స్వామి అమ్మానాన్నలతో మాట్లాడారు. ‘మంచిగుండేందుకు ఇల్లుంది. షాపు మంచిగ నడుపుకోవాలె. ఏ అవసరం వచ్చినా చెప్పండి’ అన్నారు. భోజనం వండి వడ్డించిన అంశల స్వామి సోదరి రాజేశ్వరి దంపతులకు కేటీఆర్ కొత్త బట్టలు పెట్టారు. ఆమె వండిన పప్పుచారు, పచ్చిపులుసు చాలా బాగున్నయని మెచ్చుకొన్నారు.
ఇదీ కలనా..నిజమా.. నాకింక అర్థమైతలేదు. కేటీఆర్ సార్ మా ఇంటికి వచ్చి నాతో కలిసి అన్నం తింటడనుకోలే. ఆయనతో కలిసి తిన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. నేను చాలా చిన్నోన్ని.. సార్ పెద్దోడు. తలుచుకుంటేనే పరేషాన్ అనిపిస్తున్నది. ఇల్లు కట్టుడు అయినంక సార్ వస్తడనుకోలే. అసలు ఆయన ఇంటికి వచ్చేదాక కూడా ఎవ్వరు చెప్పలే. నా బాధ తెలుసుకున్న కేటీఆర్ సార్ నన్ను ప్రగతిభవన్కు పిలిపించిన్రు.
డబుల్ బెడ్రూం కట్టిస్తా అని వెంటనే రూ.5.50 లక్షల చెక్కును మంజూరు చేశిన్రు. ఇంతకుముందు కూడా కటింగ్ షాపుకు కేటీఆర్ సారే డబ్బులు ఇచ్చిన్రు. ఏ ప్రభుత్వం ఇట్ల సాయం చేయలేదు. సీఎం కేసీఆర్ సార్, కేటీఆర్ సార్ దేవుళ్లు. ఎప్పుడూ వాళ్లకు రుణపడి ఉంటా. కర్నాటి విద్యాసాగర్ దగ్గరుండి ఇల్లు కట్టించారు. ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి కన్వీనర్ కంచుకట్ల సుభాష్ చొరవ కూడా ఉన్నది.
– అంశల స్వామి, ఫ్లోరైడ్ బాధితుడు
మేలు మరువం
మంత్రి కేటీఆర్ రాక పట్ల అంశల స్వామి తల్లిదండ్రులు సత్యనారాయణ, వెంకటమ్మ నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ ‘మా తర్వాత మా బిడ్డ బతుకెట్లని బాధపడేటోళ్లం. కేటీఆర్ వల్ల షాపు నడుపుకుంటన్నడు. చెక్క మిద్దె ఇల్లు కూలిపోతే.. సరంపేట గుట్టల్లో రేకుల గుడిసెల ఉంటున్నం. ఇప్పుడీ కొత్త ఇంట్ల ఏ రంది లేకుండ బతికేట్టు చేసిండు. కేటీఆర్కి ఎప్పటికీ రుణపడి ఉంటం. ఆయన మేలు మరువం’ అని సంతోషంగా చెప్పారు.
మాటలు రావడం లేదు: సుభాష్
ఫ్లోరైడ్ రక్కసికి బలైన విగతజీవి స్వామి ఇంటికి వచ్చి అతని కుటుంబసభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేయడమనేది కేటీఆర్కే చెల్లిందని ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి కన్వీనర్ కంచుకట్ల సుభాష్ అన్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వమే స్వామి దగ్గరికి వచ్చినట్టనిపించింది. ఒక ఫ్లోరైడ్ బాధితుడికి దక్కిన గౌరవమిది. ఉప ఎన్నిక హడావుడి ఉన్నప్పటికీ కూడా కేటీఆర్ స్వయంగా సామాన్య పౌరుడిగా స్వామి ఇంటికి రావడం ఆశ్చర్యమనిపించింది. తన క్యాడర్తో స్వామి కుటుంబసభ్యలతో కలిసి భోజనం చేయడం ఆయన సహృదయానికి నిదర్శనం’ అన్నారు.
మర్రిగూడ మండలం శివన్నగూడెంలో ఫ్లోరోసిస్ బాధితుడు అంశల స్వామి ఇంటికి భోజనానికి వచ్చిన మంత్రి కేటీఆర్ ఆ ఇంటి ముందు నల్లాలో వస్తున్న మిషన్ భగీరథ నీటిని రుచి చూశారు.