హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. వరంగల్ జిల్లా హసన్పర్తికి చెందిన ఐఐటీ విద్యార్థిని మేకల అంజలికి ఆర్థికసాయం అందజేశారు. అంజలికి రెండేండ్ల కిందట ఐఐటీలో సీటు లభించింది. పేదరికంతో బాధపడుతున్న ఆమె సహాయం చేయాలని మంత్రి కేటీఆర్ను కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. రెండేండ్లుగా తన వ్యక్తిగత సంపాదన నుంచి అంజలి ఫీజును చెల్లిస్తున్నారు. ఈ ఏడాదితోపాటు వచ్చే ఏడాదికి సంబంధించిన ఫీజు మొత్తాన్ని బుధవారం ఆమె కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా అంజలి చదువు, భవిష్యత్తు ప్రణాళికల గురించి మంత్రి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. దిగ్విజయంగా చదువు పూర్తి చేసుకొని, జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. తమ బిడ్డ చదువుకు మంత్రి కేటీఆర్ ఆర్థిక సహాయం అందించడం పట్ల అంజలి కుటుంబం ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం అంజలి ఐఐటీ ఇండోర్లో చదువుతున్నది.