హైదరాబాద్: బడి పిల్లలకు బాసటగా నిలిచిన బీఆర్ఎస్వీ నాయకుల అక్రమ అరెస్ట్ అప్రజాస్వామికమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. విద్యార్థి నాయకులకు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం అరెస్టు చేసి ఇప్పటికీ తమ విద్యార్థి నాయకుల జాడ చెప్పకుండా రాత్రంతా తిప్పుతారా అని ప్రశ్నించారు. ప్రజాపాలనలో ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని మండి పడ్డారు. సమస్యలపై నిలదీస్తే నిర్బంధాలా, బడిపిల్లలకు బాసటగా నిలిస్తే అరెస్ట్ చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుగుల అన్నం పెడుతున్నారని ప్రశ్నిస్తే కేసులు పెడ్తారా అని విమర్శించారు. గురుకుల సమస్యలపై, విద్యార్థుల ఆత్మహత్యలు, పిల్లల మరణాలపై గళమెత్తితే గొంతు నొక్కుతారా అని ప్రశ్నించారు. మా బీఆర్ఎస్వీ నాయకులు గురుకుల బాట పాడుతాం అంటే అడ్డుకుంటారా అంటూ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. అరెస్టు చేసిన వానికి తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజాపాలనలో ప్రశ్నిస్తే కేసులా ?
సమస్యలపై నిలదీస్తే నిర్బంధమా ?
*బడిపిల్లలకు బాసటగా నిలిస్తే అరెస్ట్ చేస్తారా ?
పురుగుల అన్నం పెడుతున్నారని ప్రశ్నిస్తే కేసులు పెడ్తారా ?
గురుకుల సమస్యలపై,విద్యార్థుల ఆత్మ హత్యలపై,పిల్లల మరణాలపై గళమెత్తితే గొంతు నొక్కుతారా ?
మా బిఆర్ఎస్వీ…
— KTR (@KTRBRS) November 28, 2024
గురుకులాలు, జడ్పీ స్కూళ్లల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలకు నిరసనగా మాసబ్ట్యాంక్లోని సంక్షేమ భవన్ వద్ద బీఆర్ఎస్వీ నేతలు బుధవారం మెరుపు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పోలీసులు గెల్లు శ్రీనివాస్యాదవ్ సహా విద్యార్థి నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. గెల్లు శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థుల మరణాలు, ఆత్మహత్యలు కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలేనని విమర్శించారు. కేసీఆర్ హయాంలో దేశానికే దిక్సూచిగా నిలిచిన తెలంగాణ గురుకులాలు.. కాంగ్రెస్ ఏడాది పాలనలోనే అస్తవ్యస్తంగా మారాయని ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు వల్ల విద్యార్థుల తల్లిదండ్రులకు గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లపై నమ్మకం పోతున్నదని తెలిపారు. సర్కార్ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్వీ పర్యటిస్తుందని తెలిపారు.