KTR | హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల ‘ట్విట్టర్’ వార్ ఇంకా చల్లారలేదు. తాజాగా కర్ణాటక మంత్రి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే కూడా ఇందులోకి ఎంటరయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్లు తోడుదొంగలుగా మారి తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నట్టు బుధవారం ప్రియాంక్ ఎక్స్ వేదికగా విమర్శించారు. దీనిపై బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ‘మీరు కూడా ఈ వ్యవహారంలో చేరాలనుకున్నందుకు సంతోషం. రెండు లక్షల మంది కర్ణాటక యువతకు ఉపాధి గురించి మీ నాయకుడు రాహుల్గాంధీ చేసిన ప్రకటనలు, అలాగే ఖజానా ఖాళీపై డిప్యూటీ సీఎం చేసిన ప్రకటనలు కూడా నకిలీవేనా?’ అని ట్విట్టర్లో సూటిగా ప్రశ్నించారు.
‘మేము కాంగ్రెస్ పార్టీనికాదు, బీజేపీలోని ముగ్గురు ఎంపీలు సహా తెలంగాణలో ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలందరినీ ఓడించాం. మేము, బీజేపీ ఒక్కటి కాదు అనేందుకు ఇది నిదర్శనం. సునీల్ (కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త), ఆయన బృందం చెప్పినవి గుడ్డిగా అనుకరించకుండా, అవి చెప్పేముందు మీరు కొంత జాగ్రత్తగా సన్నద్ధులైతే మంచిది’ అని హితవు పలికారు. రెండు లక్షల ఉద్యోగాల మాటను కర్ణాటక ప్రభుత్వం మర్చిపోయిందని పత్రికల్లో వచ్చిన కథనాలు, ఈ ఏడాది అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టలేమని కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ చేసిన ప్రకటనలు, ఎన్నికల సందర్భంగా రాహుల్గాంధీ ఇచ్చిన హామీలు, ఎస్సీ-ఎస్టీ సంక్షేమ నిధులను ఎన్నికల హామీలను నెరవేర్చుకునేందు కు వాడుకుంటామని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య చేసిన ప్రకటనలు, తదితర వార్తల క్లిప్పింగులను కేటీఆర్ ట్వీట్తోపాటు జత చేశారు.
ట్వీట్ల వార్ ఇలా మొదలైంది!
‘ఎన్నికల సందర్భంగా చెప్పినవన్నీ చేయాలా? చేయాలంటే ఖజానాలో డబ్బు కావాలి కదా? ఎన్నికల సందర్భంగా చెప్పినంతమాత్రాన అన్నీ ఫ్రీగా ఇవ్వాలా?’ అంటూ కర్నాటక సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలో మాట్లాడినట్టుగా ఓ వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోను కేటీఆర్ మంగళవారం ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ‘తెలంగాణలో కూడా పరిస్థితి ఇలాగే ఉంటుందా?’ అని సందేహం వ్యక్తంచేశారు. దీనిపై సిద్ధరామయ్య స్పందిస్తూ, అది బీజేపీ తయారుచేసిన ఎడిటెడ్ ఫేక్ వీడియో అని స్పష్టం చేశారు. దీన్ని కేటీఆర్ తిప్పుకొడుతూ.. ‘అబద్ధపు హామీలతో మీ పార్టీవాళ్లు (కాంగ్రెస్) తెలంగాణ ప్రజలను మోసం చేశారు. కాబట్టే మేము ఎన్నికల్లో ఓడిపోయాం. డిసెంబర్ 9న ఎన్నికల హామీలు అమలుచేస్తామని, హామీలపై చట్టాలు చేస్తామని చేసిన ప్రకటనలు ఏమయ్యాయి? డిసెంబర్ 9 దాటి 10 రోజులు గడిచినా మీ పార్టీ ఇచ్చిన హామీలు ఇంతవరకూ నెరవేరలేదు.’ అని విమర్శించారు. తెలంగాణలో ఇచ్చిన ఒక్కో హామీపై ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే ఈ ఇష్యూలో తలదూర్చగా, కేటీఆర్ దీటుగా సమాధానమిచ్చారు.