హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆలిండియా 20వ ర్యాంకర్ శ్రీజను, 218వ ర్యాంకర్ కంకణాల రాహుల్రెడ్డిని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అభినందించారు. తన కుటుంబసభ్యులతో కలిసి శ్రీజ మంగళవారం ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్ను కలిశారు. అనేక పరిమితులు ఉన్నప్పటికీ అత్యంత ప్రతిభా పాటవాలతో సివిల్స్లో విజయం సాధించిన శ్రీజను మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. శ్రీజ తల్లి ప్రభుత్వ దవాఖానలో స్టాఫ్నర్సుగా, తండ్రి ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్న నేపథ్యం నుంచి వచ్చిన శ్రీజ 20వ ర్యాంక్ సాధించి చాలా మందికి స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీజ విద్యాభ్యాసం, ప్రిపరేషన్, ఇంటర్వ్యూ తదితర అంశాలను మంత్రి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. తన తల్లి స్టాఫ్నర్సుగా అందిస్తున్న సేవలను స్ఫూర్తిగా తీసుకొని ఐఏఎస్ అధికారిగా సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో తాను చదివినట్టు శ్రీజ ఈ సందర్భంగా తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గొర్లవేడు గ్రామానికి చెందిన కంకణాల రాహుల్రెడ్డి సైతం మంత్రి కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ రాహుల్రెడ్డిని అభినందించారు.