హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వ కృషి, చిత్తశుద్ధితోనే తెలంగాణ మున్సిపాలిటీలకు జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చిందని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్-2021 జాతీయస్థాయిలో అవార్డు సాధించిన పురపాలికల మేయర్లు, చైర్ పర్సన్లు, కమిషనర్లు, పురపాలక శాఖ ఉన్నతాధికారులకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అవార్డులు అందుకున్న అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసంలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
జాతీయ స్థాయిలో తెలంగాణ పట్టణాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంపై చైర్పర్సన్లకు, అధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పట్టణ గ్రామీణ ప్రాంతాలు అన్న విభేదం లేకుండా సమగ్రంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని కేటీఆర్ అన్నారు. పట్టణ అభివృద్ధి ద్వారా రాష్ట్రాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ దిశగా గతంలో ఎన్నడూ లేనివిధంగా పట్టణాలకు ప్రత్యేక నిధులు కల్పించడంతోపాటు, పట్టణాలకు ప్రత్యేకంగా అనేక కార్యక్రమాలను తీసుకువచ్చామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకువచ్చిన అనేక వినూత్న కార్యక్రమాలు, ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ, కృషితో పట్టణాల్లో గుణాత్మక మార్పు వచ్చిందన్నారు. కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా పట్టణ పరిపాలనలో పీఎం స్వనిధి వంటి అనేక కార్యక్రమాల్లోనూ జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలుస్తుందని అన్నారు. తెలంగాణకి జాతీయ స్థాయిలో సఫాయి మిత్ర ద్వితీయ స్థానం అవార్డుతో పాటు మరో 11 స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులను దక్కించుకున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. పురపాలక శాఖ సిబ్బంది, పురపాలక సంఘాల ప్రజాప్రతినిధుల నిబద్ధత కలిగిన కృషి, సమన్వయంతోనే ఇది సాధ్యమవుతున్నదని మంత్రి అన్నారు.
జాతీయ స్థాయిలో స్వఛ్చ అవార్డులు దక్కించుకున్న పురపాలక సంఘాలను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలోని ఇతర పట్టణాలు కూడా మరింత చురుగ్గా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు రావడంతో పాటు, మంత్రి కేటీఆర్ తమకు ప్రత్యేక అభినందనలు తెలపడం పట్ల, పురపాలక సంఘాల ప్రజా ప్రతినిధులు, అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. కేటీఆర్ నాయకత్వం, ఆయన స్ఫూర్తితో పట్టణాలను అభివృద్ధిలో మరింతగా ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.