కేసీఆర్ పాలన మరోసారి రావడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పునాది కాబోతున్నది. రెండేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఆ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రతి ఒకరూ మా పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలి.
– కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): ‘జూబ్లీహిల్స్లో జరుగుతున్న ఎన్నిక పార్టీల మధ్యలో జరుగుతున్న ఎన్నిక కాదు. ఈ ఉప ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్య ఎన్నిక కాదు. పదేండ్ల అభివృద్ధి పాలనకు, రెండేండ్ల అరాచక పాలనకు మధ్య జరుగుతున్న ఎన్నిక. పదేండ్ల పారదర్శక పాలనకు, రెండేండ్ల అవినీతి పాలనకు, పదేండ్ల రైతుబంధు పాలనకు, రెండేండ్ల రాబందు పాలనకు మధ్య జరుగుతున్న ఎన్నిక. జూబ్లీహిల్స్లో ఆడబిడ్డ గెలుపు కోసం రాష్ట్రంలోని కోటీ 67 లక్షల మంది ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ కే తారకరామారావు పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీతా గోపీనాథ్ బుధవారం నామినేషన్ వేసేందుకు బయలుదేరేముందు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కేటీఆర్ విజ్ఞప్తిచేశారు. ఆమెను గెలిపిస్తేనే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలవుతాయని, ప్రజలకు, రైతులకు, అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, తర్వాత మోసపోయిన యువతీయువకులు కూడా సునీతాగోపీనాథ్ విజయం కోసం చూస్తున్నారని తెలిపారు. హైడ్రా పేరుతో తమ ఇండ్లు కూలగొట్టిన అరాచకాలను చూసిన తర్వాత, ఈ ఎన్నికకల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలవాలని, కాంగ్రెస్ సర్కారు అరాచకాలు ఆగాలని నగర పేదలు చూస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన మరోసారి రావడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పునాది కాబోతున్నదని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మరోసారి గులాబీ పార్టీ జైత్రయాత్ర జూబ్లీహిల్స్ నుంచే ప్రారంభం కాబోతున్నదని తెలిపారు. అన్ని వర్గాల మద్దతుతో, అండతో తమ పార్టీ అభ్యర్థి సునీతాగోపీనాథ్ ఘన విజయం సాధించబోతున్నారని ధీమా వ్యక్తంచేశారు. రెండేండ్ల ఈ విఫల కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఆ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రతి ఒకరూ తమ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్లో ప్రతి ఒకరికి, నియోజకవర్గానికి విశేషమైన సేవలు అందించిన నాయకుడని గుర్తుచేశారు. ‘
హైదరాబాద్ నగరంలో అన్ని నియోజకవర్గాల్లో మా పార్టీ గెలుపొందిందంటే, అప్పటి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన గోపీనాథ్ కృషి కూడా ఉన్నది. గోపీనాథ్ అకాల మరణంతో బాధపడుతున్న కుటుంబాన్ని అందరూ ఆదుకోవాలని మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయించి, ఆయన సతీమణి సునీతాగోపీనాథ్కి టికెట్ కేటాయించారు. బీఆర్ఎస్ కుటుంబంలో ఒకరైన సునీత విజయం కోసం పార్టీ కీలక నాయకులంతా పనిచేయాలని కేసీఆర్ ఆదేశించారు. అందరి ఆశీర్వాదాలతో సునీత ఎన్నికల్లో గెలవబోతున్నారు’ అని కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఎంపీ రవిచంద్ర, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, పద్మారావుగౌడ్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే కేవీ వివేకానంద్గౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, విష్ణువర్ధన్రెడ్డి, నాయకులు, రావుల శ్రీధర్రెడ్డి, సోహైల్, బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్, ఆమె కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి అవకాశంగా ప్రజలు భావిస్తున్నారని కేటీఆర్ చెప్పారు. ‘మూతపడుతున్న బస్తీ దావాఖానలు, ఆగుతున్న తాగునీటి సరఫరా విషయాన్ని ప్రజలందరూ చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క ఇల్లు కూడా హైదరాబాదులో కట్టలేదు. కేసీఆర్ కట్టించిన లక్ష ఇండ్లు, ఇచ్చిన ఇండ్ల పట్టాలు, చేసిన ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా హైదరాబాద్ నగర ప్రజలకు గుర్తున్నాయి. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన మైనార్టీలు ఈ ఎన్నికను ఒక అవకాశంగా భావిస్తున్నారు.
ప్రభుత్వంలో ఒక మైనార్టీకి కూడా అవకాశం ఇవ్వకుండా దారుణంగా అవమానపరిచిన రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి మైనార్టీలు జూబ్లీహిల్స్ ఉపఎన్నికను ఒక అవకాశంగా భావిస్తున్నారు. తమకు ఇచ్చిన బీసీ డిక్లరేషన్, రిజర్వేషన్లు అన్నీ మోసమని, ఈ అంశంలో గుణపాఠం చెప్పడానికి రాష్ట్రవ్యాప్తంగా బీసీలు సిద్ధంగా ఉన్నారు. దళితబంధు, అభయహస్తం అని చెప్పి మోసం చేసిన దళితులు కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో మా అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్కు అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతున్నది’ అని కేటీఆర్ చెప్పారు.