హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారక రామారావు నాలుగు రోజుల యూకే పర్యటన దిగ్విజయంగా ముగిసింది. ఈ నెల 18 నుంచి 22 వరకు ఆయన లండన్ పర్యటన సాగింది. లండన్లో భారత హైకమిషన్ సమావేశంతోపాటు ప్రవాస భారతీయులు, యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నారు. పలు ప్రతిష్ఠాత్మక సంస్థల అధిపతులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఇప్పటికే హైదరాబాద్లో ఉన్న పలు సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఆసక్తి చూపాయి. అంతర్జాతీయ ఫార్మా సంస్థ సర్ఫేస్ మెజర్మెంట్ సిస్టమ్స్ అత్యాధునిక పార్టికల్ క్యారెక్టరైజేషన్ లాబోరేటరీని తెలంగాణలో ఏర్పాటుచేస్తామని ప్రకటించింది. తెలంగాణ అకాడమీ ఫర్ సిల్ అండ్ నాలెడ్జ్(టాస్)తో పనిచేసేందుకు పియర్సన్ సంస్థ ముందుకొచ్చింది.
ప్రతిష్ఠాత్మక లండన్ కింగ్స్ కాలేజ్తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. హైదరాబాద్ ఫార్మా సిటీలో పెట్టబోయే ఫార్మా వర్సిటీకి పరిశోధన, అకాడమిక్ వ్యవహారాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కింగ్స్ కాలేజ్ కలిసి పనిచేయనున్నది కాగా, దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఆదివారం మంత్రి కేటీఆర్ స్విట్జర్లాండ్కు బయలుదేరారు. కేటీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర బృందానికి టీఆర్ఎస్ ఎన్నారైశాఖ కార్యకర్తలు, ఎన్నారైలు లండన్ విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు పలికారు. లండన్ హిత్రూ విమానాశ్రయం నుంచి కేటీఆర్ జ్యూరిచ్ చేరుకొన్నారు. సోమవారం నుంచి 3 రోజులపాటు జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటారు. ప్రపంచంలోని పలు ప్రతిష్ఠాత్మక కంపెనీల ప్రతినిధులతో మంత్రి సమావేశమవుతారు. అక్కడ ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించే చర్చల్లో పాల్గొననున్నారు. 26న జ్యూరిచ్లో పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు.
మంత్రి కేటీఆర్ నాలుగు రోజుల యూకే పర్యటన ముఖ్యాంశాలు
1.ఇంగ్లాండ్కు చెందిన అంతర్జాతీయ ఫార్మా సంస్థ సర్ఫేస్ మెజర్మెంట్ సిస్టమ్స్ అత్యాధునిక పార్టికల్ క్యారెక్టరైజేషన్ లాబోరేటరీని తెలంగాణలో ఏర్పాటుచేస్తామని ప్రకటించింది. ఏడు వేల చదరపు మీటర్ల వైశాల్యంలో హైదరాబాద్లో స్థాపించే ఈ ల్యాబ్లో ఔషధాల తయారీలో కీలకమైన ఫార్మాస్యూటికల్ పౌడర్ క్యారెక్టరైజేషన్పై పరిశోధనలు జరుగుతాయి. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ ఫార్మా కంపెనీల ఔషధ ప్రయోగాలకు ఈ ల్యాబ్ వేదిక కానున్నది.
2.యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ నిర్వహించిన రెండు రౌండ్ టేబుల్ సమావేశాలకు మంత్రి కేటీఆర్ అధ్యక్షత వహించారు. డెలాయిట్, హెచ్ఎస్బీసీ, జేసీబీ, ఈ అండ్ వై, రోల్స్ రాయిస్ తదితర అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను మంత్రి వివరించారు.
3.లండన్లో బ్రిటన్ అంతర్జాతీయ వాణిజ్య మంత్రి రణిల్ జయవర్ధనతో సమావేశమయ్యారు.
4.థామస్ లాయిడ్ గ్రూప్ ఎండీ నందిత సెహగల్తోపాటు కంపెనీ సీనియర్ ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు. తెలంగాణలో కొనసాగుతున్న థామస్ లాయిడ్ కంపెనీ కార్యకలాపాల విస్తరణపై చర్చించారు.
5.పియర్సన్ కంపెనీ సీనియర్ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి కేటీఆర్.. తెలంగాణలో నైపుణ్య శిక్షణ అభివృద్ధికి చేపట్టిన పలు కార్యక్రమాలను వెల్లడించారు. తెలంగాణ అకాడమీ ఫర్ సిల్ అండ్ నాలెడ్జ్(టాస్)తో పనిచేసేందుకు పియర్సన్ సంస్థ ముందుకొచ్చింది.
6.క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీ వీసీ హాల్ఫార్డ్, ప్రొ వీసీ పొల్లార్డ్ మంత్రి కేటీఆర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ఏరోనాటికల్ యూనివర్సిటీ పట్ల తాము ఆసక్తిగా ఉన్నట్టు వారు మంత్రికి తెలిపారు. ప్రపంచ స్థాయి ఏరోనాటికల్ వర్సిటీ తెలంగాణ కేంద్రంగా తీసుకొచ్చే తమ చర్యలకు కలిసి రావాలని వర్సిటీ బృందానికి మంత్రి విజ్ఞప్తి చేశారు.
7.హెచ్ఎస్బీసీకి చెందిన పాల్ మెక్ పియార్సన్, బ్రాడ్ హిల్ బర్న్ మంత్రి కేటీఆర్తో సమావేశమయ్యారు. హైదరాబాద్లో తమ కంపెనీ కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తున్నాయని, మరింతగా పెంచేందుకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. త్వరలోనే స్పష్టమైన కార్యాచరణతో మరోసారి భేటీ అవుతామని మంత్రికి వెల్లడించారు.
8.హైదరాబాద్ ఫార్మాలో భారీగా పెట్టుబడులు పెడుతున్న గ్లాక్సో స్మిత్ కె్లైవ్ (జీఎస్కే) రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్అండ్డీ) హెడ్ ఫ్రాంక్ రాయట్తో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ విస్తరణ ప్రణాళికలు, ఇప్పటికే హైదరాబాద్లో ఉన్న తమ విభాగాల పురోగతిని మంత్రి కేటీఆర్కు ఫ్రాంక్ రాయట్ వివరించారు.
9.ప్రతిష్ఠాత్మక లండన్ కింగ్స్ కాలేజ్తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. హైదరాబాద్ ఫార్మా సిటీలో పెట్టబోయే ఫార్మా వర్సిటీకి పరిశోధన, అకాడమిక్ వ్యవహారాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కింగ్స్ కాలేజ్ కలిసి పనిచేయనున్నది.
10.ఎలక్ట్రిక్ బస్సులు, వ్యాన్లు, వాణిజ్య వ్యాన్ల తయారీ సంస్థ అరైవల్ యూకే లిమిటెడ్ను సందర్శించి కంపెనీ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ చర్చలు జరిపారు. తెలంగాణతోపాటు భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో తమ ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు అలాక్స్ రిసోర్సెస్ ఎల్ఎల్పీతో ఆ లిమిటెడ్ ఒప్పందం చేసుకున్నది.
11.ప్రవాస భారతీయులు ఏర్పాటుచేసిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఎనిమిదేండ్లలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని మంత్రి వివరించారు.
12.భారత హై కమిషన్ కార్యాలయం ఏర్పాటుచేసిన సమావేశంలో కేటీఆర్ పాల్గొని తెలంగాణ విజయ ప్రస్థానాన్ని వివరించారు. అనేక రంగాల్లో తెలంగాణ దేశానికి ఆదర్శంగా మారిందని తెలిపారు.
స్విట్జర్లాండ్లో మంత్రి కేటీఆర్కు ఘన స్వాగతం
వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సు కోసం మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఆదివారం సాయంత్రం స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ నగరానికి చేరుకున్నారు. స్థానిక ఎన్నారైలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నారై స్విట్జర్లాండ్ విభాగంతోపాటు వివిధ రంగాల ఎన్నారైలు మంత్రి కేటీఆర్కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
రామన్నకు కృతజ్ఞతలు:అనిల్ కుర్మాచలం
లండన్ నుంచి జ్యూరిచ్కు వెళ్లిన కేటీఆర్కు ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యూకే వ్యవస్థాపకులు అనిల్ కుర్మాచలం కృతజ్ఞతలు తెలిపారు. ‘లండన్లో మా గౌరవాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లి మమ్ములను ఆశీర్వదించిన రామన్నకు హృదయపూర్వక కృతజ్ఞతలు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పెట్టుబడులను ఆకర్షించే మరో మిషన్ కోసం బాస్ దావోస్కు బయల్దేరారు. గుడ్లక్ కేటీఆర్ అన్న’ అని ట్వీట్ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ‘యూకేలో తెలంగాణకు అద్భుతమైన బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న అనిల్, ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే బృందానికి ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.