హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లాకు చెందిన దంపతులు విద్యుత్ షాక్తో మృతి చెందడంతో.. వారి ఇద్దరు అమ్మాయిలు అనాథలయ్యారు. ఆ చిన్నారులను ఆదుకోవాలని తెలంగాణ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులకు, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్కు మంత్రి కేటీఆర్ ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
వివరాల్లోకి వెళ్తే సింగారం గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన అనపర్తి ఉపేందర్(32), తిరుపతమ్మ(32) దంపతులకు శ్యామల(8), బిందు(6) అనే ఇద్దరమ్మాయిలు ఉన్నారు. అయితే శుక్రవారం రాత్రి తిరుపతమ్మ బట్టలను ఉతికింది. అనంతరం వాటిని జీఐ వైర్పై ఆరేస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. భార్యను ప్రాణాలు కాపాడేందుకు ఉపేందర్ ప్రయత్నించగా.. ఇద్దరూ చనిపోయారు. ఇక వీరిద్దరి అంత్యక్రియలను శ్యామల, బిందునే చేశారు. తల్లిదండ్రుల చితికి నిప్పు పెట్టిన ఇద్దరు అమ్మాయిలు బోరున విలపించారు.