హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): బోర్డు నిర్వహణ కోసం ఈ ఏడాది రూ.23.50 కోట్లు కావాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) తెలుగు రాష్ర్టాలకు ప్రతిపాదించింది. కొంతకాలంగా ఇరు రాష్ర్టాలు నిధులు విడుదల చేయకపోవడంతో బోర్డు నిర్వహణకు, జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొన్నది. ఈ తరుణంలో ఈ ఏడాదికి బోర్డు నిర్వహణకు రూ.23.50 కోట్లు కావాలని ప్రతిపాదించారు. అందులో ఉద్యోగుల వేతనాలకే రూ.12.70 కోట్లు, బోర్డు కార్యాలయాన్ని విశాఖకు తరలించడానికి రూ.2 కోట్లు అవసరం అవుతాయని బడ్జెట్లో ప్రతిపాదించారు. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల పలు ఔట్లెట్లపై నీటి ప్రవాహాలను లెక్కించేందుకు టెలిమెట్రీల ఏర్పాటుకు రూ.4.75 కోట్ల ఖర్చవుతుందని కేఆర్ఎంబీ ప్రతిపాదించింది. ఇలా మొత్తం రూ.23.50 కోట్లు అవసరమవుతాయని తేల్చింది.