ప్రాథమిక అంచనాలు పంపించిన సీపీసీడబ్ల్యూఆర్ఎస్
పూర్తిస్థాయి నివేదిక కోరిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు
హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ప్రస్తుత పరిస్థితి, నీటి వినియోగం తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు రూ.24 లక్షల వ్యయమవుతుందని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రిసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ మేరకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కు లేఖ రాసింది. ఆర్డీఎస్ ద్వారా నిర్దేశిత కేటాయింపుల మేరకు సాగునీరు రావడం లేదని, ఆనకట్ట ఎత్తును పెంచడంతోపాటు ఆర్డీఎస్ హెడ్రెగ్యులేటరీలు, కాలువల ఆధునికీకరణను చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం ఏండ్లుగా డిమాండ్ చేస్తున్నది. ఆ దిశగా తగు చర్యలు తీసుకోవాలని కేఆర్ఎంబీకి విజ్ఞప్తి చేస్తూ వస్తున్నది.
అదేవిధంగా సుంకేశులకు నీరు రావడం లేదని ఏపీ ప్రభుత్వం సైతం ఫిర్యాదు చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన బోర్డు సమావేశంలో ఆయా అంశాలపై చర్చించిన కేఆర్ఎంబీ ఆర్డీఎస్పై సమగ్ర అధ్యయనం చేయించాలని నిర్ణయించింది. ఆ బాధ్యతను తీసుకోవాలని పుణేలోని సీడబ్ల్యూపీఆర్ఎస్కు విజ్ఞప్తి చేస్తూ కేఆర్ఎంబీ లేఖను రాసింది. ఆర్డీఎస్ ప్రస్తుత నీటినిల్వ సామర్థ్యం, హెడ్రెగ్యులేటర్ నుంచి కాలువలోకి 850 క్యూసెక్కుల డిశ్చార్జి కోసం చేయాల్సిన డిజైన్ మార్పులను గుర్తించడం, కొత్తగా నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన అంశాలపై సూచనలివ్వడంతో పాటు ఇతర అంశాలపై అధ్యయనం చేయాలని మార్గదర్శకాలను రూపొందించింది. నిర్దేశించిన అంశాలపై గణాంకాల ఆధారంగా, లేదంటే క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా అధ్యయనం చేసి ఆరు నెలల్లోగా నివేదిక అందించాలని కోరింది.