హైదరాబాద్, మే30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య నెలకొన్న జల వివాదాలకు అపెక్స్ కౌన్సిల్ ద్వారానే పరిష్కారం సాధ్యమని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) భావిస్తున్నది. ఇరు రాష్ర్టాల మధ్య నెలకొన్న వివాదాలు, లేవనెత్తుతున్న అభ్యంతరాలపై అధ్యయనం చేస్తు న్న బోర్డు అధికారులు అంశాలవారీగా చర్చిస్తున్నారు. ఈ మేరకు అపెక్స్ కౌన్సిల్ సమావేశ ఎజెండాను సిద్ధం చేసేందుకు నిర్ణయించారు. రెండు రాష్ర్టాల జలవివాదాల పరిష్కారానికి ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం అపెక్స్ కౌన్సిల్ ఏర్పడింది. కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి కౌన్సిల్ చైర్మన్ కాగా, ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం తొలిసారి 2016లో, 2020లో రెండోసారి సమావేశం జరిగింది. ఇప్పటివరకు మళ్లీ అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరుగలేదు. రెండో సమావేశానంతరం ఏపీ ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే రాయలసీమ ఎత్తిపోతలతో పాటు, ఆవులపల్లి రిజయర్వాయర్, జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టుల విస్తరణను చేపట్టింది.