ముషీరాబాద్, మే 31(నమస్తే తెలంగాణ) : బీసీ కార్పొరేషన్ ద్వారా రాయితీ రుణాలు ఇస్తామంటూ స్వీకరించిన రాజీవ్ యువవికాసం దరఖాస్తులు ఏమయ్యాయో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున బీసీబంధు పథకం ప్రవేశపెట్టి అమలు చేయాలని కోరారు. ఆదివారం విద్యానగర్లోని బీసీ భవన్లో 14 బీసీ సంఘాల సమావేశం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్కుమార్ అధ్యక్షతన జరిగింది.
సమావేశంలో పాల్గొన్న ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రాజీవ్ యువవికాసం ద్వారా రుణాలు ఇస్తామని లక్షలాది నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించారని, ఏ ఒక్కరికీ రుణం ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. బీసీ కార్పొరేషన్కు 20 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని, దరఖాస్తు చేసుకొన్నవారికి రాయితీ రుణాలు ఇవ్వాలని, ఒక్కో కుటుంబానికి బీసీబంధు రూ.20 లక్షలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. 120 బీసీ గురుకులాలు ఏర్పాటు చేయాలని కోరారు.