హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలో ఎక్కడా రెండు నదీ పరివాహక ప్రాంతాలు ఒకేలా ఉండవని తెలంగాణ తరఫున సాక్షిగా వ్యవహరిస్తున్న సీడబ్ల్యూసీ విశ్రాంత సీఈ చేతన్ పండిట్.. కృష్ణా ట్రిబ్యునల్కు స్పష్టం చేశారు. ప్రతి రివర్ బేసిన్కు ప్రత్యేకమైన పరిస్థితులు, లక్షణాలు ఉంటాయని, వాటి ఆధారంగానే సమస్యలకు పరిష్కారాలను సూచించాలని ఉద్ఘాటించారు. తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్-2 విచారణ బుధవారం ఢిల్లీలో ప్రారంభమైంది.
మూడు రోజులపాటు కొనసాగే ఈ విచారణలో తొలి రోజు చేతన్ పండిట్ను ఏపీ సీనియర్ న్యాయవాది ఉమాపతి క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ఆపరేషన్ ప్రొటోకాల్పై ఏపీ లేవనెత్తిన అనేక అభ్యంతరాలకు చేతన్ పండిట్ దీటుగా సమాధానమిచ్చారు. తుంగభద్ర బోర్డు, నర్మదా జల వివాదాల ట్రిబ్యునల్, కావేరీ జల వివాదాల ట్రిబ్యునల్ అనుసరిస్తున్న ఆపరేషన్ ప్రోటోకాల్ మాడల్నే కృష్ణా బేసిన్లోని ఉమ్మడి రిజర్వాయర్ల విషయంలో అనుసరించవచ్చు కదా? అంటూ ఏపీ సీనియర్ న్యాయవాది సంధించిన ప్రశ్నను ఆయన కొట్టిపారేశారు. ఆ మాడల్నే అమలు చేయాలని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 చెప్పలేదని బదులిచ్చారు. కృష్ణా బేసిన్కు నీటి సరఫరా ఒక్క రాష్ట్రంలో మాత్రమే ఉన్నదని, అందువల్ల ఆ మాడల్ సరిపోదని తేల్చిచెప్పారు.