హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) 17వ సమావేశాన్ని ఈ నెలాఖరున నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఎజెండా అంశాలపై ముమ్మర కసరత్తు చేస్తున్నారు. వాస్తవానికి ఈ సమావేశం జనవరి 11వ తేదీనే జరగాల్సి ఉన్నప్పటికీ ఇరు రాష్ర్టాల విజ్ఞప్తి మేరకు వాయిదా పడింది. ఆ తర్వాత బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ ఉద్యోగ విరమణ నేపథ్యంలో ఇప్పటివరకు ఈ సమావేశం జరగలేదు. దాదాపు నెల క్రితం కొత్త చైర్మన్గా శివనందన్కుమార్ నియమితులవడంతో బోర్డు సమావేశం ఏర్పాటుపై కేఆర్ఎంబీ దృష్టి సారించింది. ప్రస్తుతం కేఆర్ఎంబీ వద్ద ఉన్న నిధులు మరో 3 నెలలకు మాత్రమే సరిపోయే అవకాశం ఉండటంతో వీలైనంత త్వరగా బోర్డు సమావేశాన్ని నిర్వహించి వార్షిక బడ్జెట్ను ఆమోదింపజేసుకునేందుకు కసరత్తు చేస్తున్నది. ప్రస్తుతం బోర్డులో విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు బేసిక్పై అధికంగా చెల్లిస్తున్న 25 శాతం ఇన్సెంటివ్స్ను కేంద్ర జల్శక్తి శాఖ రద్దు చేయడంతోపాటు ఇప్పటివరకు చెల్లించిన మొత్తాన్ని రికవరీ చేయాలని ఇటీవల కేఆర్ఎంబీని ఆదేశించింది. దీనితోపాటు నీటి పంపకాలు, పలు ఇతర అంశాలపై బోర్డు చర్చించనున్నట్టు తెలుస్తున్నది.