హైదరాబాద్, నవంబర్10 (నమస్తే తెలంగాణ): నీరు ఎక్కువ ఉన్న చోట వినియోగాన్ని తగ్గించుకొని, ఆ నీటిని తక్కువ ఉన్న చోటుకు పంపింగ్ చేసుకొనే ఆఫ్ సెట్ మాడల్ ఎంతో శ్రేయస్కరమని సీడబ్ల్యూసీ విశ్రాంత సీఈ, తెలంగాణ తరఫు సాక్షి చేతన్ పండిట్ అన్నారు. తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై చేపట్టిన బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్-2 విచారణ రెండోరోజు గురువారం ఢిల్లీలో కొనసాగింది.
తెలంగాణ తరఫున సాక్షి చేతన్ పండిట్ను ఏపీ సీనియర్ న్యాయవాది ఉమాపతి పలు అంశాలపై క్రాస్ ఎగ్జామిన్ చేశారు. చేతన్ ఏపీ అభ్యంతరాలకు దీటుగా సమాధానమిచ్చారు. కాగా, ట్రిబ్యునల్ చైర్మన్ బ్రిజేశ్కుమార్ పలు అంశాలపై చేతన్ను నేరుగా ప్రశ్నించారు. ఆపరేషన్ ప్రొటోకాల్లో భాగంగా ప్రతిపాదించిన ఆఫ్ సెట్ మాడల్ అమలు ఎలా సాధ్యమవుతుందని, దానిని వివరించాలని సూచించారు.