కొండాపూర్/హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): గచ్చిబౌలి ర్యాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో మరోమారు సినీ ప్రముఖుల పేర్లు బయటకు రావడం సంచలనంగా మారింది. హోటల్లో నిర్వహించిన డ్రగ్స్ పార్టీలో పలువురు వ్యాపారవేత్తలతోపాటు టాలీవుడ్కు చెందిన దర్శకుడు క్రిష్, నిర్మాత కేదారినాథ్, నటి లిపి గణేశ్ సైతం పాల్గొన్నట్టు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డ్రగ్స్ పార్టీ కోసం కొకైన్ను సప్లయ్ చేసిన సయ్యద్ అబ్బాస్ అలీ జెఫ్రీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ర్యాడిసన్లో తరచుగా డ్రగ్స్ పార్టీలు నిర్వహించుకుంటామని ఆ హోటల్ యజమాని కొడుకు వివేకానంద పోలీసుల విచారణలో వెల్లడించాడు.
వివేకానందకు ఇప్పటివరకు పదిసార్లు కొకైన్ సరఫరా చేసినట్టు అబ్బాస్ అలీ తెలిపాడు. డ్రగ్స్ పార్టీకి హాజరైన వివేకానంద అతని స్నేహితులు నిర్భయ్, రఘు చరన్, కేదార్, సందీప్, శ్వేత, లిపి, నీల్, క్రిష్తోపాటు అందరినీ నిందితులుగా చేర్చారు. డ్రగ్స్ వాడకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసింది, అదే తోవలో ప్రస్తుత ప్రభుత్వం కూడా నడుస్తున్నది. హోటల్ యజమాని కొడుకు ఇచ్చే డ్రగ్స్ పార్టీలకు సినీ ప్రముఖులు, వ్యాపారులు వచ్చిపోతుంటారని విచారణలో వెల్లడైంది. నిందితుల ఫోన్లను పోలీసులు విశ్లేషిస్తున్నారు.
ఈ కేసులో నిందితులుగా ఉన్న శ్వేత, సందీప్ పరారీలో ఉన్నారని, చరణ్ బెంగుళూర్లో ఉన్నా, వస్తానని చెప్పాడని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. డ్రగ్స్ తీసుకున్న అనుమానితుల జాబితాలో డైరెక్టర్ క్రిష్ ఉన్నాడని, డ్రగ్ పరీక్షల కోసం వస్తానని చెప్పాడని వెల్లడించారు. హోటల్ నిర్వాహకులపై కేసు నమోదు చేస్తామని, అబ్బాస్ ఎక్కడి నుంచి డ్రగ్ తెస్తున్నాడనే దానిపై ఆరా తీస్తున్నామని తెలిపారు.
గచ్చిబౌలి ర్యాడిసన్ డ్రగ్స్ కేసులో డొంకంతా కదులుతున్నది. ఈ నెల 25న మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో గచ్చిబౌలిలోని ర్యాడిసన్ బ్లూ హోటల్ రూమ్ నం. 1200, 1204లో డ్రగ్స్ పార్టీ ప్రారంభం కాగా, పోలీసులకు రాత్రి సమాచారం అందింది. దీంతో పోలీసులు రాత్రి 12:30 గంటలకు హోటల్పై దాడి చేశారు. హోటల్ గదుల్లో డ్రగ్స్ వాడేందుకు ఉపయోగించే ప్లాస్టిక్ కవర్లు, వైట్ పేపర్లు, సెల్ఫోన్లు లభించాయి. హోటల్ సిబ్బందిని విచారించగా, సదరు గదుల్లో తమ హోటల్ డైరెక్టర్ గజ్జెల వివేకానంద తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడని చెప్పారు. పోలీసులు వచ్చే కొద్ది సమయం ముందే వివేకానంద ఇంటికి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు జూబ్లీహిల్స్లోని వివేకానంద ఇంటికి వెళ్లగా, ఉదయం 6 గంటల వరకు ఆయన ఇంటి గేటు తీయలేదు. చివరికి వివేకానందను అదుపులోకి తీసుకుని విచారించగా, 10 మంది స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నట్టు తెలిపాడు. తమ హోటల్ మాజీ ఉద్యోగి సయ్యద్ అబ్బాస్ అలీ జాఫ్రీ తమకు కొకైన్ సరఫరా చేయగా, తాము ఆ మత్తుమందును తీసుకున్నామని అంగీకరించాడు. వివేకానందను అరెస్టు చేసి, అతను ఇచ్చిన సమాచారంతో నిర్మాత కేదారినాథ్, వ్యాపారవేత్త నిర్భయ్లను అదుపులోకి తీసుకున్నారు. వీరికి డ్రగ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది.
టాలీవుడ్ నిర్మాత కేదారినాథ్, మరో టాలీవుడ్ ప్రముఖ హీరోతో జూబ్లీహిల్స్లో పలు పబ్లను నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే క్రిష్ మీద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. టాలీవుడ్ ప్రముఖ నటి లిపి గణేశా, యూ ట్యూబర్ శ్వేత సైతం డ్రగ్స్ పార్టీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించి వీరి మీద కూడా కేసు నమోదు చేశారు. లిపి గణేశా, శ్వేతతో పాటు సందీప్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. కొద్దిరోజుల క్రితం లిపి గణేశా, ఆమె సోదరి కుషితా జూబ్లీహిల్స్ పబ్లో జరిగిన డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నట్టు ఆరోపణలు వచ్చా యి. ర్యాడిసన్లో మరో వ్యక్తి నీల్, రఘుచరణ్లపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగుళూరులో ఉన్న రఘుచరణ్ విచారణకు వస్తానని చెప్పినట్టు పోలీసులు తెలిపారు.
ఈ కేసులో ఎ1గా ఉన్న హోటల్ యజమాని కొడుకు వివేకానంద రిమాండ్ను కోర్టు తిరస్కరించింది. నిందితుడిని సోమవారం కోర్టులో హాజరు పరిచి రిమాండ్ విధించాలని పోలీసులు కోరారు. కేసు రిమాండ్ డైరీని పరిశీలించిన కూకట్పల్లి కోర్టు నిందితుడి వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించకపోవడం, ప్రత్యక్షంగా, ఎలక్ట్రానిక్, మెడికల్కు సంబంధించిన సాక్ష్యాలను పోలీసులు పొందుపరుచకపోవడం, నిందితుడిని అరెస్ట్ చేసిన 24 గంటల్లో కోర్టులో హాజరుపరచకపోవడం వంటి కారణాలను చూపుతూ రిమాండ్కు తిరస్కరించింది. రూ.10 వేల వ్యక్తిగత పూచీకత్తుపై నిందితుడిని విడుదల చేసింది.