కాంతినిచ్చే కిరణాలతడు.. క్రాంతిని కాంక్షించే అభ్యుదయ వాది. ‘క్రాంతి’ ఆయన పేరేకాదు.. ఆయన తత్వం కూడా. ఎక్కడున్నా.. ఏ పనిచేసినా ఆయన శైలి, ఆలోచన ఆద్యంతం భిన్నంగా ఉంటాయి. హక్కుల కార్యకర్త, జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమకారుడిగా ఆయన జీవితం నిత్యం పోరాటాలమయం. ఆ పోరాడే తత్వమే ఆయనకు గుర్తింపును తెచ్చింది. తెగించి కొట్లాడే తత్వమే ఆయన్ను ఎదిగేలా చేసింది. ఆయనే అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్.
క్రాంతి కిరణ్ జర్నలిస్టుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో రైతుల ఆత్మహత్యలు అధికంగా జరుగుతుండేవి. ఈ చావులకు వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. దీనిపై ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాల్లో ప్రధాన పాత్ర పోషించారు. రైతుల ఆత్మహత్యలకు గల కారణాల అన్వేషణపై నిజ నిర్ధారణ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమంలో ముందుండి పోరాడారు.
తొలిప్రయత్నంలోనే విజయం..
ఎమ్మెల్యే క్రాంతి కిరణ్కు ఎలాంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేదు. ఆయన పోటీచేసిన తొలి ప్రయత్నంలోనే విజయాన్ని సాధించారు. ఉమ్మడి రాష్ర్టానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదర రాజనర్సింహ్మను, వెండితెరపై నవ్వులు పూయించిన కమెడియన్ బాబూమోహన్లను క్రాంతికిరణ్ అనే ఓ సామాన్యుడు మట్టి కరిపించారు. తెలంగాణ జర్నలిస్టులను ఏకంచేసి, భావజాలాన్ని వినిపించి, ఉద్యమాన్ని అగ్రభాగంలో నిలిపి 14 ఏండ్ల పాటు పోరాడిన క్రాంతికిరణ్, ఇప్పుడు తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞంలో భాగస్వామ్యమవుతున్నారు. తాజా ఎన్నికల్లో మళ్లీ అందోల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.
కాళేశ్వరంతో గోదావరి జలాలను నియోజకవర్గానికి తెచ్చేందుకు కృషిచేస్తున్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పనులకు శంకుస్థాపన చేయించారు. రానున్న రోజుల్లో సింగూరు నుంచి గోదావరి జలాలు అందోల్ నియోజకవర్గానికి చేరి సస్యశ్యామలం కానున్నది.
ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. జర్నలిస్టు నాయకుడిగా, (టీజేఎఫ్) వ్యవస్థాపక సభ్యుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా హైదరాబాద్ కేంద్రంగా ఎన్నో ఉద్యమాలు చేశారు. సీమాంధ్ర పాలకుల అరాచకాలను ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం నింపారు. పరకాల ప్రభాకర్ ‘రుజువులు లేని తెలంగాణ ఉద్యమం’ పుస్తకం పేరుతో తెలంగాణ ఉద్యమాన్ని అవమానించే ప్రయత్నంచేయగా, జర్నలిస్టులంతా చంటి క్రాంతి కిరణ్ నేతృత్వంలోనే పుస్తకావిష్కరణను అడ్డుకున్నారు. ఈ సభలో క్రాంతి కిరణ్ చేయి తెగగా, గాయాలపాలై దవాఖానలో చేరాల్సి వచ్చింది.
జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ జర్నలిస్టులను అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సుకు హాజరుకాకుండా నిషేధించడంతో, వివక్ష, వెలికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ తీయడం ఒక చరిత్రగా చెప్పుకోవచ్చు. ఢిల్లీలో వెయ్యి మంది జర్నలిస్టులతో భారీ ర్యాలీని నిర్వహించారు. జేఏసీ తరఫున నిర్వహించిన ఆందోళనల్లో పాల్గొన్నందుకు జోగిపేట ఠాణాలో కేసు నమోదయ్యింది.