హైదరాబాద్ : త్వరలోనే వందేళ్లు పూర్తి చేసుకోబోతున్న కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కోఠి ఉమెన్స్ కాలేజీని మహిళా యూనివర్సిటీగా తీర్చిదిద్దే అంశంపై మంగళవారం తన కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు.
ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉండి యూజీసీ స్వయంప్రత్తితో, న్యాక్ గుర్తింపు కలిగిన కోఠి మహిళా కళాశాలను ఉమెన్స్ యూనివర్సిటీగా మార్చేందుకు అన్ని అర్హతలు కలిగి ఉందని ప్రభుత్వం భావించిందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కావాల్సిన చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. బోధనా సౌకర్యాలు, విద్యార్థినులకు కావాల్సిన వసతులు, మౌలిక సదుపాయాలపై చర్చించి, నివేదిక సిద్ధం చేయాలని సూచించారు.
ప్రస్తుతం కోఠి ఉమెన్స్ కాలేజీలో 4,159 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారని, దీన్ని యూనివర్సిటీగా మారిస్తే విద్యార్థినుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. కోఠి ఉమెన్స్ కాలేజీని యూనివర్సిటీగా మారిస్తే తెలంగాణ మహిళల ఉన్నత విద్యలో మహర్దశ వస్తుందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉన్నత విద్యలో హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో దూసుకెళ్తుందన్నారు. ఇక ఈ కాలేజీ యూనివర్సిటీగా మారితే హైదరాబాద్కు మరిన్ని పేరు ప్రఖ్యాతులు వస్తాయన్నారు. యూనివర్సిటీ ఏర్పాటుకు కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేసి, త్వరలోనే ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్ వెంకట రమణ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, కోఠి ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపల్ విజులతతో పాటు పలువురు పాల్గొన్నారు.