యాదాద్రి, జూలై 29: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో శుక్రవారం శ్రావణలక్ష్మీ కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ అమ్మవారిని పట్టువస్ర్తాలు, బంగారు ఆభరణాలతో దివ్యమనోహరంగా అలంకరించారు. ప్రధానాలయం వెలుపలి ప్రాకారంలోని ఈశాన్య మండపంలో పశ్చిమ దిశకు అభిముఖంగా అధిష్ఠింపజేశారు. నూతన ఆలయంలో మొదటిసారి శ్రావణ పూజలు కావడంతో ప్రపంచ మహిళా సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ లక్ష్మీదేవికి కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు చేపట్టారు.
30 రోజులపాటు సాగే ఈ వేడుకల్లో మొదటి రోజు రుత్వికులు 3.60 లక్షల లక్ష్మీ సహస్రనామాలను పఠించారు. మొదటి రోజు వేడుకల్లో విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, కలెక్టర్ పమేలాసత్పతి, ఈవో గీత తదితరులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా అమరచింతకు చెందిన మారెడ్డి ప్రమీల అమ్మవారికి బంగారు చీరె సమర్పించారు. కుంకుమార్చనకు నిజాంపేట మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ రజితారవికాంత్ రూ.60వేల విరాళం సమర్పించారు.