జహీరాబాద్ : జాతీయస్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలతో కూటమి ఏర్పాటు చేసి, బీజేపీ(BJP) విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీపీఐ(CPI) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఆదివారం నిర్వహించిన ఆలిండియా తంజీమె ఇన్సాఫ్ మహాసభలకు హాజరై మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్తో పాటు దేశంలో ఉన్న 17 పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయన్నారు. తెలంగాణలో పొత్తుల విషయమై ఇప్పుడే చెప్పలేమన్నారు. పొత్తుల విషయం రాష్ట్ర సమావేశం నిర్ణయం తీసుకుంటుందన్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల తరువాత రాష్ట్రంలో రాజకీయ పార్టీల పరిస్థితి మారే అవకాశం పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ గతంలో బీజేపీపై ఎన్నో మాటలు మాట్లారని, అధికారంలోకి రాగానే బీజేపీ వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడడం లేదన్నారు. జగన్ ప్రభుత్వం అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయి బీజేపీ వంత పాడుతున్నదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధిక స్థానాలు సాధిస్తేనే దేశంలో బీజేపీ వ్యతిరేక కూటమి నిలబడే అవకాశం ఉంటుందన్నారు.