హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): పొత్తులపై కాంగ్రెస్ మాటమారిస్తే మంచిది కాదని, పొత్తుపై నేడో, రేపో ఫైనల్ అవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. కాంగ్రెస్తో పొత్తు ఉంటుందనే నమ్మకంతో ఉన్నామని చెప్పారు. గురువారం ఆయన హైదరాబాద్లోని మఖ్దూంభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. తమకు కొత్తగూడెం, చెన్నూర్, సీపీఎంకు మిర్యాలగూడ, వైరా ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ మాట తప్పితే సీపీఎంతో కలిసి ముందుకెళ్తామని స్పష్టం చేశారు. పొత్తులో సీట్ల కేటాయింపు జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ యూటర్న్ తీసుకోవడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అసహనం వ్యక్తం చేశారు. నిశ్చితార్థం అయ్యాక యింకో అందమైన అమ్మాయి గాని అబ్బాయిగాని దొరికితే లాగేస్కుని పొవడం వ్యక్తి జీవితంలో అక్కడక్కడా జరగవచ్చేమో కానీ వ్యవస్థను కాపాడే రాజకీయాల్లో కూడా జరిగితే ఎలా? అంటూ ట్వీట్ చేశారు.