హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారతదేశానికి తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల్లో చైతన్యం కారణంగా ఉత్తరాదితో పోలిస్తే దక్షిణ భారతదేశంలో జనాభా తక్కువని గుర్తు చేశారు. కాబట్టి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉత్తరాదిలో లోక్సభ స్థానాలు పెరుగుతాయన్నారు. దీనివల్ల దక్షిణ భారతదేశంలో అసంతృప్తి పెరిగి ప్రత్యేక ‘దక్షిణ భారతదేశం’ డిమాండ్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం, ఐఐటీలు ఎక్కడని కేంద్రాన్ని ప్రశ్నించారు. నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ రాజదండానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని మండిపడ్డారు. దానిని ప్రదర్శించడం ద్వారా దేశంలో తిరిగి రాచరిక పాలన తేవాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
ఈ నెల 4న కొత్తగూడెంలో తలపెట్టిన ‘సీపీఐ ప్రజాగర్జన’ బహిరంగ సభను ఈ నెల 11కు మార్చినట్లు కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. లక్షమందితో భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేసుకున్నప్పటికీ, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్ 5న సభ జరిగే ప్రదేశంలోనే సింగరేణి ‘విద్యుత్ డే’ను నిర్వహిస్తుండడంతో వాయిదా వేసుకోవాల్సి వచ్చిందన్నారు. హైదరాబాద్ మగ్దూంభవన్లో గురువారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ, టీ శ్రీనివాసరావు, కలవేన శంకర్లతో కలిసి కూనంనేని విలేకరుల సమావేశంలో మాటాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో సీపీఐ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు.