హైదరాబాద్ : రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలను చక్రబంధంలో బందించే కుట్రలో భాగంగానే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రూ.2 వేల నోట్లు రద్దు నిర్ణయం చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. గతంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికల (UP Election)సమయంలో కూడా అప్పటి ఎస్పీ ప్రభుత్వాన్ని బలహీన పరిచేందుకు పెద్ద నోట్ల రద్దు చేశారని విమర్శించారు. అదే తరహాలో ఇప్పుడీ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.
తాజాగా రెండు వేల రూపాయల నోట్ల రద్దు నిర్ణయం గతంలో నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రభుత్వం చేసిన ఘోర తప్పిదాలకు నిదర్శనమని పేర్కొన్నారు. రూ. 2 వేల నోట్ల రద్దు వెనుక కుట్ర దాగివున్నదన్నారు. కర్నాటకలో బీజేపీ(Karnataka BJP) ఘోర ఓటమి నుంచి ప్రజల దృష్టి మరలచడానికి రద్దు నిర్ణయాన్ని ప్రకటించారని విమర్శించారు. ప్రతి అంశాన్ని ఏదోరకంగా ప్రచారం కోసం వాడుకునే మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు.
గతంలో పెద్దనోట్లు రద్దు చేసినప్పుడు నల్లధనం బయటికి వస్తున్నదని, ఉగ్రవాదం, అవినీతి అంతమవుతున్నదని మోదీ బీరాలు పలికారని గుర్తుచేశారు. ఆ లక్ష్యాలు నెరవేరకపోగా నాడు పెద్దనోట్ల మార్పిడి కోసం దేశ వ్యాప్తంగా ప్రజలు బ్యాంకుల వద్ద బారులు తీరారని, వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. నాటి నిర్ణయం వల్ల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడ్డాయని, కోట్లాది మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారని అన్నారు.
నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి, పన్నుఎగవేతదారులకు, కార్పొరేట్ ధనస్వాములకు ఉపయోగపడిందన్నారు. మోదీ అసమర్ధ పాలన వలనే దేశాభివృద్ధికి, ప్రజావళికి జరిగిన నష్టానికి బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి పదవికి రాజీనామా(Resign) చేయాలని ఆయన డిమాండ్ చేశారు.