గజ్వేల్/తొగుట, నవంబర్ 5: సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ నిర్వహణ చాలా బాగున్నదని బ్యాంకర్లు ప్రశంసించారు. శనివారం కాళేశ్వరం ప్రాజెక్టును వివిధ బ్యాంకుల అధికారులు సందర్శించారు. రెండో బృందం మర్కూక్ మండల కేంద్రంలోని కొండపోచమ్మ ప్రాజెక్టును సందర్శించింది. బృందంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుల అధికారులు శ్రీనివాస్, అభిజిత్ కుమార్, శేయో శంకర్నాథ్, రాజ్కమల రాపక, లాల్ బహదూర్ శాస్త్రి గుబ్బా ఉన్నారు. బ్యాంకర్లకు ప్రాజెక్టు ఈఈ బాలాజీ ఆధ్వర్యంలో ఏఈఈలు అరుణ్కుమార్, సాయి ప్రాజెక్టు నిర్వహణ, కొండపోచమ్మ సాగర్, పంపుహౌస్లకు సంబంధించిన వివరాలు తెలిపారు. ప్రాజెక్టు నుంచి ఎన్ని పంపుల ద్వారా నీటిని విడుదల చేస్తారు? ప్రాజెక్టులో నీటి నిల్వ స్థాయి ఎంత? తదితర వివరాలను బ్యాంకర్లు అడిగి తెలుసుకున్నారు. కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు, పంపుహౌస్ నిర్వహణ మిగతా అన్ని ప్యాకేజీల కంటే బాగున్నదని వారు మెచ్చుకున్నారు.