మల్యాల, మార్చి 23: తీగె లాగితే డొంక కదిలిన చందంగా కొండగట్టు ఆలయ దుకాణాల లీజ్ వ్యవహారంలో ఒక్కొక్కటిగా అక్రమాల గుట్టు బయటకు వస్తున్నది. తాజాగా ఈవో టంకశాల వెంకటేశ్ సస్పెండ్ అయ్యారు. షాపుల కేటాయింపులో అక్రమాలపై ఈ నెల 18న ‘నమస్తే తెలంగాణ’లో ‘దుకాణాల లీజులో గోల్మాల్’ శీర్షికన కథనం ప్రచురితం కావడంతో అధికార యంత్రాంగం కదిలింది.
దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు ఆదేశాల మేరకు దేవాదాయశాఖ అదనపు కమిషనర్ జ్యోతి విచారణ జరిపి నివేదిక సమర్పించగా అధికారులు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఆలయ ఉద్యోగులకు మెమోలు జారీ చేశారు. తాజాగా శనివారం ఏకంగా ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్ను సస్పెండ్ చేశారు. ఆలయ ఖాతాల నిర్వహణ, పర్యవేక్షణపై నిర్లక్ష్యంతోనే ఈవోను విధుల నుంచి తొలగించారు.
ఆగమేఘాల మీద విచారణ
దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ జ్యోతి, అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ ఈ నెల 19న కొండగట్టుకు చేరుకున్నారు. కార్యాలయంలోని లీజుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. నగదు వ్యవహారాల్లో రికార్డులు సరిగా లేకపోవడం, ఈవో పర్యవేక్షణ లోపంతోనే లీజు ద్వారా వచ్చిన నగదును ఆలయ ఖాతాల్లో జమ చేయలేదని నిర్ధారించారు. గతంలో చేపట్టిన ఆడిట్ అభ్యంతరాలను సైతం పరిశీలించకపోవడం, రీక్యాన్సిలేషన్ చేయకపోవడంలో ఈవో నిర్లక్ష్యం చూపారని ప్రాథమికంగా తేల్చారు.
ఈనెల 21న దేవాదాయ శాఖ కమిషనర్కు నివేదిక అందజేశారు. ఇందులో 2007-08 ఆర్థిక సంవత్సరం నుంచి 2017-18 వరకు రూ.14.56 కోట్ల విలువైన ఆడిట్ అభ్యంతరాలను రీక్యాన్సిలేషన్ చేయకపోవడం, 2018-19లో రూ.59.18 లక్షల అభ్యంతరాలు రీక్యాన్సిల్ చేయకపోవడం, రూ.17.61 లక్షలు నగదు పుస్తకంలో నమోదు చేసిన బ్యాంకులో జమకాలేదని వెల్లడించారు. ఈవో నిర్లక్ష్యంతోనే ఆలయ పరిధిలోని ఓ ఉద్యోగి రూ.52 లక్షలు కాజేసినట్టు గుర్తించారు.
2023-24లో ఆలయ ఖాతా పుస్తకంలో రూ.4.93 కోట్లు నమోదు చేయగా, బ్యాంకులో 4.81 కోట్లు మాత్రమే జమయ్యాయని, రూ.11.55 లక్షలు డిపాజిట్ చేయలేదని వెల్లడించారు. ఈవో ఆడిట్ అభ్యంతరాలను పక్కన పెట్టడం, ఓ ఉద్యోగి రూ.52.39 లక్షలు కాజేయడం, 9 నెలలుగా రికార్డుల పరిశీలన చేయకపో వడంతో పరిపాలన గాడి తప్పిందని విచారణలో గుర్తించారు. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ ఈవోను సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్కు ఆలయ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు.