మల్యాల, మార్చి 19: కొండగట్టు అంజన్న క్షేత్రంలో దేవాదాయ శాఖ అధికారులు మంగళవారం సోదాలు చేశారు. ‘కొండగట్టు లీజులో గోల్మాల్’ అంటూ ఈ నెల 18న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి దేవాదాయ కమిషనర్ హన్మంతరావు స్పందించారు. విచారణకు ఆదేశించగా అదనపు కమిషనర్ జ్యోతి, అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ మంగళవారం కొండగట్టు అంజన్న క్షేత్రానికి వచ్చారు. రెండు బృందాలుగా విడిపోయి ఆలయ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు.
కాగా, దుకాణాల లీజు సొమ్ముల వసూళ్లలో రూ.11.20 లక్షల గోల్మాల్ జరిగిందని ‘నమస్తే’ బహిర్గతం చేయగా, అధికారులు రూ.14.49 లక్షలు గోల్మాల్ జరిగినట్టు గుర్తించడం విశేషం. ఆలయంలో 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు గాను దుకాణాల టెండర్లకు సంబంధించి విచారణ చేపట్టినట్టు దేవాదాయ కమిషనర్ జ్యోతి తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.14,49,900 దుకాణ యజమానుల నుంచి వసూలు చేసి ఆలయానికి చెల్లించలేదని వెల్లడించారు. దుకాణదారుల నుంచి సొమ్ము వసూలైనట్లు డిమాండ్ కలెక్షన్ బుక్ (డీసీబీ)లో సంబంధిత సెక్షన్ ఇన్చార్జి, ఆలయ పర్యవేక్షకుడు, ఈవో సంతకం చేశారన్నారు. అట్టి నగదును బ్యాంక్లో జమ చేశారా..? లేదా అనే విషయాన్ని సూపరింటెండెంట్, ఈవో పరిశీలించకుండానే ఎలా సంతకం చేశారనే.. అంశంపై దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్కు బుధవారం నివేదిక సమర్పించనున్నట్టు చెప్పారు. 2023-2024 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.38 లక్షలు లెక్కచూపని ఓ ఉద్యోగిని సస్పెండ్ చేసినట్టు పేర్కొన్నారు. 2018-2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లెక్కలు పరిశీలిస్తే, ఆ ఏడాదిలో సైతం దుకాణాదారుల నుంచి వసూలు చేసిన మొత్తాలను బ్యాంక్లో జమచేయనట్టు ఆడిట్ అధికారుల అభ్యంతరాలు తెలిపినట్టు ఉన్నట్టు ఆమె వెల్లడించారు. అందుకు సంబంధించిన నగదు పుస్తకాలను సీజ్ చేసినట్టు చెప్పారు.