వరంగల్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంత్రి కొండా సురేఖ తన ప్రసంగంలో నాలుగైదుసార్లు ‘ముఖ్యమంత్రి’ అని పేర్కొన్నారే కానీ రేవంత్రెడ్డి పేరెత్తలేదు. సీఎం పేరెత్తకపోవటం హాట్టాపిక్గా మారింది. మంగళవారం ఆమె వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటి వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆమె 14 నిమిషాలు మాట్లాడారు. వనమహోత్సవం ప్రాధాన్యతను ‘ముఖ్యమంత్రి’ ఇప్పటికే చెప్పారని, గత జూలైలో ‘ముఖ్యమంత్రి’ నిర్వహించిన సమీక్షలో పేర్కొన్నారని.. ఇలా పలు సందర్భాల్లో మంత్రి కొండా సురేఖ సీఎం హోదాను మాత్రమే ఉదహరించి, రేవంత్ పేరును మాత్రం ఉచ్చరించకపోవటం గమనార్హం.
ఇటీవల మంత్రి సురేఖ కూతురు సుస్మితా పటేల్ సీఎం రేవంత్పై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ‘ముఖ్యమంత్రివి కాగా నే కండ్లు నెత్తికి ఎక్కాయా? నువ్వూ, నీ తమ్ముళ్లు కలిసి రాష్ట్రం మీద పడి తినటం తప్ప ప్రజలకు ఏం సేవ చేశావ్?’ వంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని, ఏకంగా ఆమెను బర్తరఫ్ చేయాలని సీఎం వర్గీయులు డి మాండ్ చేయటం, ఉద్దేశపూర్వకంగా తన మీద కావాలనే వ్యాఖ్యలు చేయిస్తున్నారని, వారెవరో గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆమె అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు.
మరోవైపు కుమార్తె చేసిన కామెంట్లపై వివరణ ఇవ్వాలని పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆమెకు నోటీసులు ఇవ్వటం, తన బిడ్డ చేసిన వ్యాఖ్యలకు తనకేం సంబంధమని, వాటికి తనకు నోటీసులు ఇవ్వటం ఏంది? అని ఆమె క్రమశిక్షణ కమిటీకి సమాధానం ఇవ్వటం, ఈ పరిణామాలు కొనసాగుతున్న క్రమంలోనే ఇంగ్లండ్ పర్యటన ముగించుకొని వచ్చిన తెల్లారి సీఎం రేవంత్ మీడియా సమావేశం నిర్వహించటం, మంత్రి సురే ఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలపై ‘పీసీసీ క్రమశిక్షణ కమిటీ, అధిష్ఠానం చూసుకుంటా యి’ అని గుంభనంగా ఉండటం, అంతకుముందు హైదరాబాద్లో ఉన్న మంత్రులందరితో మా ట్లాడి సురేఖతో మాట్లాడకపోవటం వంటి పరిణామాలకు కొనసాగింపుగా వనమహోత్సవం కార్యక్రమంలో సురేఖ రేవంత్ పేరును మాటమాత్రంగానైనా ఉచ్చరించకపోవడం హాట్టాపిక్ మారింది.