Komuravelli | సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. వేడుకల్లో స్వామివారి కల్యాణం, పట్నంవారం, లష్కర్ వారం, మహా శివరాత్రి రోజున పెద్దపట్నం, అగ్నిగుండాలు నిర్వహించనున్నారు. ఆదివారం పట్నం వారంతో ఉత్సవాలు మొదలై 12 ఆదివారాలు కొనసాగనున్నాయి. ఈ నెల 22న స్వామి వారి కల్యాణ వేదిక వద్ద పెద్దపట్నం జరుగనున్నది. కల్యాణం అనంతరం అగ్నిగుండాల కార్యక్రమాన్ని హైదరాబాద్ ఒగ్గు పూజారులు, ఆలయ పర్యవేక్షణలో నిర్వహించనున్నారు.
భక్తులు స్వామివారిని దర్శించుకున్న అనంతరం కొండపోచమ్మ, నల్లపోచమ్మ ఆలయాల వద్దకు వెళ్లి అక్కడ బోనాలు సమర్పిస్తారు. పట్నంవారం సందర్భంగా హైదరాబాద్కు చెందిన 50వేల మంది భక్తులు కొమురవెల్లి క్షేత్రానికి తరలివచ్చి మల్లన్న స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు మల్లన్నపేరిట సట్టీ దీక్షలను 41 రోజులు నిర్వహించి, పట్నం వారం స్వామి వారిని దర్శించుకుని, దీక్షలు విరమించనున్నారు. అనంతరం గుట్టపై ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పిస్తారు. పట్నం వారం సందర్భంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అదనపు డీసీపీ మహేందర్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.