హైదరాబాద్ : కొమురవెల్లి మల్లన్న కల్యాణ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కల్యాణ మండపంలో మల్లికార్జునస్వామి కేతలమ్మ, మేడలాదేవీని వివాహం ఆడనున్నారు. మార్గశిర మాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకుని వీరశైవ ఆగమశాస్త్రం ప్రకారం వేడుక జరుగనున్నది. ఈ కల్యాణోత్సవంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. కల్యాణాన్ని తిలకించేందుకు సుమారు వేలాది మంది భక్తులకు తరలిరానుండగా ఏర్పాట్లు పూర్తి చేశారు.
వీరశైవ పీఠాధిపతి కాశీ జ్ఞానసింహాసన మహాపీఠశాఖాధిపతి షటస్థలబ్రహ్మ 108 శ్రీగురు సిద్ధ మణికంఠ శివాచార్యమహాస్వామి పర్యవేక్షణలో కల్యాణ తంతు జరుగనున్నది. ఈ వేడుకలో మహదేవుని వంశస్తులైన మహాదేవుని మనోహర్-మమత దంపతులు కన్యాదాతలుగా, కన్యాగ్రహీతలుగా పడిగన్నగారి వంశస్తులైన పడిగన్నగారి మల్లేశం-బాలమణి వ్యవహరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి హరీశ్రావు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు.