సిద్దిపేట, డిసెంబర్ 25 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): భక్తుల కొంగుబంగారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం ఆదివారం వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు రాష్ట్ర నలుమూలలతోపాటు పొరుగు రాష్ర్టాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. శాశ్వత కల్యాణ వేదిక వద్ద కొవిడ్ నిబంధనలమేరకు ఏర్పాట్లు చేశారు. విద్యుద్దీపాలతో ఆలయాన్ని అలంకరించారు. మల్లన్న కల్యాణానికి ఆర్థ్ధికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. హరీశ్రావుతోపాటు మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తదితరులు హాజరుకానున్నారు.
ఆలయ సంప్రదాయం ప్రకారం వరుడు శ్రీమల్లికార్జునస్వామి వారి తరఫున పడిగన్నగారి వంశస్థులు, వధువులు శ్రీమేడలాదేవి, శ్రీకేతమ్మ దేవీ తరపున మహాదేవుని వంశస్థులు ఆదివారం ఉదయం 10.45 గంటలకు కల్యాణాన్ని జరిపించనున్నారు.